
ఉపాధ్యాయులకు బకాయిలు చెల్లించాలి
భీమవరం: ఉపాధ్యాయులకు ఆర్థిక బకాయిలు చెల్లించి 12వ పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.సాయిశ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఏఆర్కేఆర్ మున్సిపల్ హైస్కూల్లో గుత్తుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. పెండింగ్, 11వ పీఆర్సీ, సరెండర్ లీవ్, ఏపీజీఎల్ఐ బకాయిలు చెల్లించకపోవడంతో టీచర్లు నష్టపోతున్నారన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల స్థానంలో డీఎస్సీ అభ్యర్థులు వచ్చే వరకూ అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలన్నారు. 2008, 1998 ఎంటీఎస్ టీచర్లకు 62 ఏళ్ల వయో పరిమితిని పెంచి వారిని రెగ్యులర్ విధానంలో నియమించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సాయివర్మ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కేవీ రామచంద్రరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.దావీదు, జిల్లా ఆర్థిక కార్యదర్శి పీవీడీ ప్రసాద్ పాల్గొన్నారు.
ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తులు
ఉండి: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో రెండో విడత ప్రవేశాలకు వచ్చేనెల 15లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఐటీఐ జిల్లా కన్వీనర్ వి.శ్రీనివాసరాజు తెలిపారు. దరఖాస్తు అనంతరం సమీపంలోని ప్రభుత్వ ఐటీఐలో సర్టిఫికెట్లు పరిశీలన చేయించుకోవాలన్నారు. వీరు మాత్రమే కౌన్సెలింగ్కు అర్హులని తెలిపారు. టెన్త్ ఫెయిలైన విద్యార్థుల కోసం వెల్డర్ ట్రేడ్ అందుబాటులో ఉందన్నారు. మరిన్ని వివరాలకు 08816 297093, 9676099988 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.