గ్రామీణ విద్యార్థులకు బంగారు భవిత | - | Sakshi
Sakshi News home page

గ్రామీణ విద్యార్థులకు బంగారు భవిత

Jun 29 2025 6:53 AM | Updated on Jun 29 2025 6:53 AM

గ్రామ

గ్రామీణ విద్యార్థులకు బంగారు భవిత

కౌన్సెలింగ్‌కు ఏం కావాలి?

పదో తరగతి హాల్‌ టిక్కెట్‌, మార్కుల లిస్టు, టీసీ, కాండక్ట్‌ సర్టిఫికెట్‌, స్టడీ సర్టిఫికెట్‌(4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు), ఎస్సీ, ఎస్టీ, బీసీలు కుల ధృవీవకరణ పత్రం, ఆదాయ ధ్రువ పత్రం, ఈడబ్ల్యుఎస్‌ కోటాలో సీటు పొందిన వారు ఈడబ్ల్యుఎస్‌ సర్టిఫికెట్‌, అభ్యర్థి, అతని తండ్రిది గాని, తల్లిది కాని రెండు పాసుపోర్టు ఫొటోలు, రేషన్‌ కార్డు, అభ్యర్థి ఆధార్‌ కార్డు, విద్యార్థులకు ఎవరికై నా బ్యాంకు లోన్‌ అవసరమైతే పైన పేర్కొన్న సర్టిఫికెట్లన్నీ నాలుగు సెట్లు, అభ్యర్థి తండ్రి ఉద్యోగి అయితే ఎంప్లాయి ఐడెంటీ కార్డు, శాలరీ సర్టిఫికెట్‌, అభ్యర్థి తండ్రి పాన్‌కార్డు, ఆధార్‌ కార్డు, ఓటర్‌ ఐడీ కార్డు తెచ్చుకోవాలి.

ఎలా రావాలంటే

● ప్రకాశం, గుంటూరు జిల్లా వైపు నుంచి వచ్చేవారు విజయవాడ బస్టాండుకు చేరుకున్న తరువాత అక్కడి నుంచి ప్రతి పది నిమిషాలకు నూజివీడుకు బస్సులు ఉన్నాయి. విజయవాడ నుంచి నూజివీడుకు 40 కి.మీ. దూరం మాత్రమే. నూజివీడు బస్టాండులో దిగిన తరువాత అక్కడి నుంచి మైలవరం రోడ్డులో ఉన్న ట్రిపుల్‌ ఐటీకి నిత్యం ఆటోలు ఉంటాయి.

● శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులు హనుమాన్‌జంక్షన్‌ బస్టాండులో గాని, రైల్వేస్టేషన్‌లో గాని దిగితే అక్కడి నుంచి నూజివీడుకు నిత్యం బస్సులు, ఆటోలు ఉన్నాయి. బస్సు ప్రయాణమే తక్కువ శ్రమ, సురక్షితం అనేది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గమనించాలి.

నూజివీడు: గ్రామీణ పేద వర్గాలకు చెందిన ప్రతిభా వంతులైన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ఇంజినీరింగ్‌ విద్యను అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆలోచనకు రూపమే ట్రిపుల్‌ ఐటీలు. ఈ ట్రిపుల్‌ ఐటీలను ఆర్జీయూకేటీ నిర్వహిస్తోంది. ఆరు సంవత్సరాల సమీకృత ఇంజినీరింగ్‌ విద్యా బోధనకు నిలయమైన ట్రిపుల్‌ ఐటీలో ఆహ్లాదకరమైన వాతావరణం, క్రమశిక్షణ, ఉత్తమ విద్యాబోధన నూజివీడు ట్రిపుల్‌ ఐటీ సొంతం. విద్యతో పాటు విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, క్రీడలు, శాసీ్త్రయ సంగీతం, నాట్యం, యోగా వంటి వాటిల్లో కూడా శిక్షణనిస్తారు. ఉదయం అల్పాహారం అనంతరం అసెంబ్లీ, 8 నుంచి 12 గంటల వరకు తరగతులు, 12 నుంచి 1గంట వరకు భోజన విరామం, మళ్ళీ ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు, అనంతరం టీ, స్నాక్స్‌, 6 గంటల వరకు ఆటలు, రాత్రి 7 గంటలకు భోజనం, అనంతరం రాత్రి 10 గంటల వరకు స్టడీ అవర్స్‌.. ఇవీ ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల దైనందిన కార్యక్రమాలు. నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఈ నెల 30, వచ్చే నెల ఒకటిన 2025–26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రవేశం పొందనున్న విద్యార్థుల, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ‘సాక్షి’ అందిస్తున్న సమగ్ర కథనం.

కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహిస్తున్న కౌన్సిలింగ్‌లో భాగంగా ఈనెల 30న 550 మంది అభ్యర్థులకు, వచ్చే నెల 1న 550 మంది అభర్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ కౌన్సెలింగ్‌కు రాష్ట్రంలోని నలుమూలల నుంచి సీట్లు వచ్చిన అభ్యర్థులు పాల్గొననున్నారు. కౌన్సెలింగ్‌కు రావాల్సిన అభ్యర్థులందరికీ ఇప్పటికే ట్రిపుల్‌ ఐటీ అధికారులు కాల్‌లెటర్లు పంపడంతో పాటు వారి సెల్‌ఫోన్‌లకు మెసేజ్‌లు కూడా పంపారు. ట్రిపుల్‌ ఐటీ ఆవరణలోని స్టూడెంట్‌ యాక్టివిటీ సెంటర్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహణకు ఏర్పాటు చేశారు.

● ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్‌ విద్యలో మొదటి రెండు సంవత్సరాలు ఇంటర్‌కు సమానమైన పీయూసీ కోర్సును, తరువాత నాలుగు సంవత్సరాలు ఇంజినీరింగ్‌ విద్యను బోధిస్తారు.

● ట్రిపుల్‌ ఐటీలో చేరిన తరువాత విద్యార్థులు మొదటి రెండు సంవత్సరాలు ఏడాదికి రూ.45 వేలు, తరువాత నాలుగు సంవత్సరాలు ఏడాదికి రూ.50 వేలు చొప్పున చెల్లించాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత కలిగిన విద్యార్థులకు ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రభుత్వం చెల్లించిన నగదు పోను మిగిలిన సొమ్మును విద్యార్థులే చెల్లించాల్సి ఉంటుంది.

● అన్ని సబ్జెక్టులకు ప్రతి నెలా పరీక్షలు ఉంటాయి. నాలుగు నెలల తరువాత సెమిస్టర్‌ పరీక్షలు ఉంటాయి. ప్రతి సెమిస్టర్‌ 24 వారాలు ఉంటుంది. జులై 15 నుంచి తరగతులు ప్రారంభమై నవంబరు 30 వరకు తరగతులు జరుగుతాయి. అనంతరం సెమిస్టర్‌ పరీక్షలు ఉంటాయి. పీయూసీలో ఎంపీసీ, ఎంబైపీసీ స్ట్రీమ్‌లుంటాయి. ఇంజినీరింగ్‌లో కెమికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, సీఎస్‌ఈ, ఈసీఈ, ట్రిపుల్‌ ఈ, సీఎస్‌ఈ విత్‌ స్పెషలైజేషన్‌ ఇన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌ అండ్‌ మెషీన్‌ లెర్నింగ్‌, మెకానికల్‌, మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచిలున్నాయి.

● సెలవు రోజులలో తల్లిదండ్రులు వచ్చి తమ పిల్లలతో గడపడానికి అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితులలో పిల్లలను అవసరమైతే ఇళ్ళకు పంపుతారు. ఇచ్చిన గడువులోగా తిరిగి రాకపోతే ఫైన్‌ విధిస్తారు.

● విద్యార్థుల ఆరోగ్యంకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దీనికి ట్రిపుల్‌ఐటీ ఆవరణలోనే 30 పడకల ఆసుపత్రి ఉంది. ఇందులో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారు.

● ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కిందకు రాని అభ్యర్థులు మొత్తం ఫీజును చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి శ్రీ డైరెక్టర్‌, ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ఐటీ నూజివీడుశ్రీ పేరున డీడీని ఏజాతీయ బ్యాంకు నుంచైనా తీసుకుని ఇవ్వాలి.

● రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద వెయ్యి రూపాయలు, ఎస్సీ ఎస్టీలు రూ.500 చెల్లించాలి. గ్రూపు ఇన్సూరెన్స్‌ కింద రూ.1200, రిఫండబుల్‌ కాషన్‌ డిపాజిట్‌ కింద ప్రతి అభ్యర్థి వెయ్యి రూపాయలు, హాస్టల్‌ మెయింట్‌నెన్స్‌ చార్జి వెయ్యి రూపాయలు అడ్మిషన్‌ సమయంలో చెల్లించాలి.

ఈ నెల 30, జూలై 1న నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో కౌన్సెలింగ్‌

గ్రామీణ విద్యార్థులకు బంగారు భవిత1
1/1

గ్రామీణ విద్యార్థులకు బంగారు భవిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement