
ఒకే ఒక్కడు
పెనుమంట్ర: పెనుమంట్ర మండలంలో విద్యా శాఖ నిర్లక్ష్యంతో పాఠశాలలు మూసివేసే పరిస్థితి నెలకొంది. సరిగా పాఠశాలల విభజన జరగకపోవడంతో కొన్ని స్కూళ్లలో కేవలం ఒకరిద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మండలంలో 47 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో వెలగలవారిపాలెం (ఆర్) పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు, ఎంపీపీ నాగళ్లదిబ్బ, కొయ్యేటిపాడు స్పెషల్ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థి ఇప్పటి వరకు చేరారు. వెలగలవారిపాలెం పాఠశాలలో సింగిల్ టీచర్ ఉన్నప్పటికీ నాగళ్ల దిబ్బ, కొయ్యేటిపాడు పాఠశాలలకు ఉపాధ్యాయులు లేకపోవడంతో ఈ పాఠశాలల్లో ఆన్లైన్ ద్వారా ఒక్కో విద్యార్థి చేరారు. ఈ పాఠశాలలకు వేరే పాఠశాల నుంచి ఉపాధ్యాయులను డిప్యుటేషన్పై పంపుతున్నట్లు ఎంఈవో యు.నాగేశ్వరరావు శనివారం తెలిపారు. వెలగలవారిపాలెం పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు ఉన్నట్లు హాజరు చూపుతున్నప్పటికీ శనివారం ఆ పాఠశాలలో ఒక్క విద్యార్థిని మాత్రమే ఉన్నారు. దళితవాడలో పాఠశాలకు నాడు–నేడులో అధునాతన భవనాలు నిర్మించారు. గత ఏడాది ఈపాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు, 30 మంది వరకు విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది ఇద్దరు ఉపాధ్యాయులతో 12 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇదే పరిస్థితి మండలంలో అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఉంది. ఇందుకు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని పలువురు తల్లిదండ్రులు విమర్శిఽస్తున్నారు.

ఒకే ఒక్కడు