
ఎస్సీ క్రైస్తవులు, పాస్టర్లపై దాడులు హేయం
ఏలూరు(టూటౌన్): దేశంలో, రాష్ట్రంలో ఎస్సీ క్రైస్తవులు, పాస్టర్లపై దాడులు హేయమని, దాడులను నిరసిస్తూ ఈ నెల 30న విజయవాడలో నిర్వహించే ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండెం సంతోష్కుమార్ పిలుపు నిచ్చారు. స్థానిక ఇండోర్ స్టేడియం ఎదురుగా లేడీస్ క్లబ్లో ఎస్సీ క్రైస్తవులు, పాస్టర్ల ఆత్మీయ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్సీ క్రైస్తవులు, పాస్టర్లు, చర్చిలపై దాడులు రాజ్యాంగ విరుద్ధమైన చర్యని ఇలాంటి సంఘటనలు ఖండిస్తున్నామన్నారు. ఫాదర్ ఇంజమాల మైఖేల్, కె.శాంతి సాగర్లు మాట్లాడుతూ రిజర్వేషన్ల పేరుతో దళితులకు మత స్వేచ్ఛ లేకుండా చేయడం దళితుల ఆత్మ గౌరవాన్ని కించపరచడమే అన్నారు. సమావేశంలో ప్రొఫెసర్ ఎన్ఏడీ పాల్, పెరికె వరప్రసాదరావు, దోమతోటి అబ్రహం, నూకపెయ్యి కార్తీక్ పాల్గొన్నారు.
బైక్పై నుంచి పడిన వ్యక్తి మృతి
ద్వారకాతిరుమల: కుక్క అడ్డు రావడంతో బైక్పై నుంచి పడి తీవ్ర గాయాలు పాలైన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానిక పోలీస్టేషన్లో శనివారం కేసు నమోదైంది. ఎస్సై టి.సుధీర్ తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని దేవినేనివారిగూడెంకు చెందిన కూచింపూడి నాగు(45) ఈనెల 23 న ఇసీ్త్ర పెట్టెలోని బొగ్గుల కోసమని పంగిడిగూడెంకు వెళ్లాడు. తిరిగి సాయంత్రం బైక్పై స్వగ్రామానికి వెళుతుండగా, ఘటనా స్థలమైన సూర్యచంద్రరావుపేట జెర్సీ పార్లర్ వద్దకు వచ్చేసరికి అకస్మాత్తుగా కుక్క అడ్డువచ్చింది. దాంతో కుక్కను ఢీకొట్టి రోడ్డుపై పడిపోయిన నాగుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగు శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
సొమ్ముల రికవరీకి చర్యలు
వీరవాసరం: నందమూరి గరువులో డ్వాక్రా సంఘాల్లో జరిగిన స్కాం నగదును రికవరీ చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఏపీఎం కే.జ్యోతిరాణి శనివారం తెలిపారు. 2022 నుంచి 2025 మార్చి వరకు ఖాతాల నుంచి గ్రూపు సభ్యులకు తెలియకుండా పోతుల నాగ స్వాతి, బోడపాటి సత్యవాణి నగదును కాజేశారని వివరించారు. సుమారు రూ.85 లక్షల మేర అవినీతి చోటుచేసుకుందని, బోడపాటి సత్యవాణి నుంచి సుమారు రూ.18 లక్షల మేర రికవరీ చేశామన్నారు. నాగస్వాతిపై వీరవాసరం పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించామన్నారు.
యంత్రాలు ఇప్పిస్తానని మోసం
భీమవరం: వ్యవసాయ యంత్రాలు రాయితీపై ఇప్పిస్తానని రూ.8 లక్షలు తీసుకుని మోసగించినట్లు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ ఎం.నాగరాజు తెలిపారు. పాలకొల్లుకు చెందిన కత్తుల వెంకటేశ్వరరావు భీమవరానికి చెందిన యింకి వెంకటేశ్వరరావు దగ్గర నాలుగు దఫాలుగా నగదు తీసుకున్నారన్నారు. రాయితీపై యంత్రాలు ఇప్పించలేదని ఫిర్యాదులో పేర్కొనగా ఎస్సై కృష్ణాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎస్సీ క్రైస్తవులు, పాస్టర్లపై దాడులు హేయం