దిగుబడిలో విత్తన శుద్ధి కీలకం | - | Sakshi
Sakshi News home page

దిగుబడిలో విత్తన శుద్ధి కీలకం

Jun 29 2025 6:53 AM | Updated on Jun 29 2025 6:53 AM

దిగుబ

దిగుబడిలో విత్తన శుద్ధి కీలకం

భీమవరం: సార్వా వరి నారుమడి పనుల్లో రైతులు నిమగ్నయ్యారు. గత రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వెన్ను దన్నుగా నిలబడి అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంతో రైతులు ఉత్సాహంగా వరి సాగు పట్ల ఆసక్తి చూపించారు. రైతులకు వరి కోత యంత్రాలు, ట్రాక్టర్లకు పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇవ్వడమేగాక పంటల బీమా పథకం, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ వంటివి అమలు చేశారు. ప్రస్తుతం సార్వా సాగుకు సిద్ధమవుతున్న రైతులకు రైతు భరోసా, గత సార్వాసీజన్‌లో వర్షాలు కారణంగా దెబ్బతిన్న రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇవ్వకపోవడంతో ప్రస్తుత సీజన్‌లో వరి సాగుకు ఇబ్బందులు పడుతున్నారు. పథకాల మాటేలా ఉన్నా వరి సాగులో విత్తన ఎంపిక, విత్తనశుద్ధి, సస్యరక్షణ వంటి వాటిపై రైతులు దృష్టి పెట్టాలని వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో సుమారు సుమారు 5.40 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేయనున్నారు. దీనిలో పశ్చిమగోదావరి జిల్లాలో 2.08 లక్షల ఎకరాలు, ఏలూరు జిల్లాలో సుమారు 3 లక్షలకు పైగా ఎకరాల్లో సాగు చేయాల్సి ఉంది. వరి నారుమళ్లు వేయడానికి ఎకరాకు 30 కిలోల వరకు విత్తనాలు అవసరమవుతాయి.

విత్తన సేకరణ ఇలా

పురుగులు, తెగుళ్లు ఆశించని పాలం నుంచి విత్తనాన్ని సేకరించుకోవాలి. రైతులు తమ సొంత విత్తనాన్నే వాడుకుంటుంటే పంట కోత కోసిన తరువాత విత్తనాలతో పాటు కలిసిపోయిన మట్టి, శీలీంద్ర బీజాలు, పురుగు తుట్టెలను తీసివేసి శుభ్రం చేసి నిలువ చేసుకోవాలి. బయట విత్తనాన్ని కొనుగోలు చేసే సమయంలో విత్తన శుద్ధి చేశారో లేదో నిర్ధారించుకోవాలి. కొనుగోలు చేసిన విత్తనానికి సంబందించిన బిల్లును తప్పనిసరిగా తీసుకోవాలి. విత్తనాల మొలక శాతం తప్పనిసరిగా పరీక్షించుకోవాలి.

నాణ్యమైన విత్తనం అయినా

ఎక్కువ ముంది రైతులు సొంతంగా విత్తనాలను పండించుకోవడం లేదా తోటి రైతుల నుంచి విత్తనాలను కొనుగోలు చేస్తుంటారు. విత్తనాలతో పాటు కొన్ని తెగుళ్లను కలుగచేసే శీలీంద్రాలు, బ్యాక్టీరియా, వైరస్‌ వంటివి పంటలను ఆశించి తీవ్రమైన నష్టాన్ని కలుగచేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో నాణ్యమైన విత్తనం అయినప్పటికీ భూమి నుంచి, వివిధ రకాల పురుగుల నుంచి తెగుళ్లు ఆశించి పంటను నష్టపరుస్తూ ఉంటాయి. అందువల్ల పంటను తొలిదశలోనే రక్షించుకోవడానికి సిఫారసు చేసిన శీలీంద్ర నాశినులతో గానీ, పురుగు మందులు లేదా జీవ శీలీంద్ర నాశినులతో తప్పని సరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి మందులు పొడి, ద్రవ రూపంలో, కాన్సస్‌ట్రేట్స్‌ రూపంలో మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి.

విత్తన శుద్ధి పద్ధతులు

పొడి విత్తన శుద్ధి : డ్రమ్ముల్లో మూడింట రెండొంతులు విత్తనం వేసి సిఫార్సు చేసిన మోతాదులో మందు వేసి బాగా తిప్పితే విత్తనానికి మందు పట్టుకుంటుంది. కొన్ని రకాల విత్తనాలకు జిగురు, బెల్లం ద్రావణం, చిక్కటి గంజి ద్రావణం వంటివి కలపడం వల్ల మందు బాగా పట్టుకుని విత్తనానికి రక్షణ కవచంగా ఏర్పడి చీడ పీడల నివారణకు సాధ్యమవుతుంది.

తడి విత్తన శుద్ధి : ముఖ్యంగా వరి విత్తన శుద్ధికి తగినంత నీటిని తీసుకుని ఆ నీటిలో సిఫార్పు చేసిన మందు కలుపుకుని నీటిలో విత్తనాలను నానబెట్టడం ద్వారా చీడ పీడల నుంచి పంటలను రక్షించుకోవచ్చు.

జీవ శిలీంద్ర నాశినులతో

కొన్ని రకాల జీవ శీలీంద్ర నాశినులతో ముఖ్యంగా ట్రైకోడెర్మావిరిడి. సూడోమోనాస్‌ వంటి వాటితో విత్తన శుద్ధి చేయడం వల్ల తెగుళ్లను కలుగచేసే శీలీంధ్రాలను నాశనం చేయడమేగాక వంట చివరి వరకు కూడా రక్షణ కల్పిస్తాయి. ఈ మందులు భూమిలోనే అభివృద్ధి చెంది తరువాత వేసే పంటలకు కూడా ఉపయోగపడతాయి. వీటి మోతాదు కిలో విత్తనానికి 8 నుంచి 30 గ్రాముల వరకు వాడుకోవాలి. సిఫార్సు చేసిన మందులతో విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా తక్కువ ఖర్చుతో పంటలను చీడపీడల బారి నుంచి రక్షించుకోవచ్చు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 5.40 లక్షల ఎకరాల్లో వరి సాగు

విత్తన శుద్ధితో పంటకు రక్షణ

వరిసాగులో విత్తనశుద్ధి ద్వారా పురుగుమందుల ఖర్చు తగ్గడమేగాక పంటలో అధిక దిగుబడులు సాధించవచ్చు. సార్వా సాగుకు సిద్ధమవుతున్న రైతులు తప్పనిసరిగా విత్తన శుద్ధిపై దృష్టిపెట్టాలి. విత్తనశుద్ధికి అవసరమైన సమాచారం కోసం అందుబాటులోని వ్యవసాయశాఖాధికారులను సంప్రదించాలి.

– డాక్టర్‌ ఎంవీ కృష్ణాజీ, వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధానశాస్త్రవేత్త, మార్టేరు

దిగుబడిలో విత్తన శుద్ధి కీలకం 1
1/1

దిగుబడిలో విత్తన శుద్ధి కీలకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement