
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ముదినేపల్లి రూరల్ : చెరువు యజమాని మందలించాడనే మనస్తాపంతో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని వైవాకలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన చేబోయిన శ్రీనివాసరావు (55) స్థానికంగా చేపల చెరువుపై కాపలా ఉంటూ మేతలు చల్లేవాడు. ఈ నేపథ్యంలో మేతల బస్తాలు దొంగతనానికి గురవుతున్నాయని, ఇందుకు శ్రీనివాసరావు కారకుడని యజమాని మందలించడంతో పాటు గ్రామంలోని పెద్దలకు విషయాన్ని తెలియజేస్తానని బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాసరావు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. భార్య, కుమారుడు గమనించి వెంటనే గుడివాడ ఆసుపత్రికి తీసుకువెళ్లగా మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృతి చెందాడు. మృతుడి కుమారుడు సోమరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వీరభద్రరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
తమ్మిలేరులో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
చింతలపూడి: చేపల వేటకు వెళ్లి గల్లంతైన చింతలపూడి నగర పంచాయతీ ఛార్లెస్ నగర్కు చెందిన యువకుడి మృతదేహాన్ని ఆదివారం వెలికితీశారు. నాగిరెడ్డిగూడెం సమీపంలోని తమ్మిలేరులో చేపల వేట కోసం శనివారం స్నేహితులతో కలిసి వెళ్లిన గడ్డం శాంతకుమార్(29) ప్రమాదవశాత్తూ గల్లంతైన విషయం తెలిసిందే. శనివారం రాత్రి వర్షం కురవడంతో గాలింపు చర్యలు నిలుపుదల చేసిన అధికారులు ఆదివారం ఉదయం కొనసాగించి మృతదేహాన్ని కనుగొన్నారు. ఎస్సై కె సతీష్ కుమార్ ఆధ్వర్యంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని పంచనామ అనంతరం పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ కుమార్ చెప్పారు. శాంతకుమార్ మృతితో ఛార్లెస్ నగర్లో విషాద ఛాయలు నెలకొన్నాయి.