
ప్రతి గింజా కొంటాం
సివిల్ సప్లయిస్ ఎండీ మన్జీర్ జిలానీ
పెంటపాడు: రాష్ట్రంలో అకాల వర్షం వల్ల తడిసిన ప్రతి గింజను సివిల్ సప్లయిస్ ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడవద్దని పౌరసరఫరాల సంస్థ ఎండీ డాక్టర్ మన్జీర్ జిలానీ పేర్కొన్నారు. మంగళవారం ఆయన పెంటపాడు మండలంలోని దర్శిపర్రు రైతు సేవాకేంద్రాన్ని సందర్శించారు. జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి, సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ టి. శివరామ్ప్రసాద్లతో కలిసి పలు రైస్మిల్లుల్లో గోనె సంచులు తనిఖీ చేశారు. అనంతరం దర్శిపర్రు ఆర్బీకే వద్ద జిలానీ మాట్లాడుతూ.. రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత రైతు సేవా కేంద్రాల్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఫోన్ నెంబర్ ఏర్పాటు చేశామన్నారు. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా రైతులకు తప్పక గిట్టుబాటు ధర దక్కుతుందన్నారు. ఆకాల వర్షం వల్ల పెద్దగా నష్టం జరగకపోయినా తడిచిన ధాన్యం కొనుగోలుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంతవరకూ ఎంత ధాన్యం కొన్నారో, సంచుల కొరత తదితర వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ఆర్డీవో కౌసర్ బానో, వ్యవసాయాధికారి కె.పార్థసారథి తదితరులు పాల్గోన్నారు.