తోతాపురి.. ధర దిగజారి | - | Sakshi
Sakshi News home page

తోతాపురి.. ధర దిగజారి

Jun 6 2025 7:35 AM | Updated on Jun 6 2025 7:35 AM

తోతాప

తోతాపురి.. ధర దిగజారి

నూజివీడు: గత 20 ఏళ్లలో ఎన్నడూలేని సంక్షోభాన్ని మామిడి రైతులు ఎదుర్కొంటున్నారు. పండ్లలో రారాజుగా పేరొందిన మామిడి రైతులను ఈ ఏడాది కోలుకోలేని నష్టాల ఊబిలో ముంచేసింది. తోతాపురి రకం ధర దారుణంగా పతనమవ్వడంతో రైతులు, వ్యాపారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ ఏడాది మామిడి దిగుబడి తక్కువగా ఉన్న నేపథ్యంలో ధర ఎక్కువగా ఉంటుందను కున్న మామిడి రైతుల ఆశలు అడియాశలు అయ్యాయి. ఏలూరు జిల్లాలో నూజివీడు, చింతలపూడి ప్రాంతాల్లో దాదాపు 50 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. వరి, మొక్కజొన్న పంటల తర్వాత ప్రధాన ఉద్యాన పంటగా విరాజిల్లుతున్న మామిడి రైతులకు చేదునే రుచిచూపుతోంది. మార్చి ప్రారంభం నుంచి మామిడి కోతలు ప్రారంభం కాగా తొలుత ఆశాజనంగా ఉన్న తోతాపురి ధర రానురాను తగ్గుతూ వచ్చి ప్రస్తుతం పూర్తిగా పతనమైంది. టన్ను రూ.3 వేలకు పడిపోవడంతో రైతులకు, వ్యాపారులకు కోత కూలి, కిరాయిలు కూడా రాని పరిస్థితి. దీంతో రైతులు, కాయలు కొనుగోలు చేసిన వ్యాపారులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రారంభంలో తోతాపురి రకం టన్నుకు రూ.15 వేల వరకు ధర వచ్చింది. ఆ తర్వాత క్రమేపీ రూ.9 వేలకు, రూ.5 వేలకు పడిపోయి ప్రస్తుతం రూ.3 వేలు పలుకుతోంది. దీంతో ఈ రకం సాగుచేసిన రైతులు లబోదిబోమంటున్నారు.

ప్రారంభంలో కావాలనే ధర పెంచుతూ..

మామిడి కాయలను మార్కెట్‌కు రప్పించేందుకు సీజన్‌ ప్రారంభంలో సేట్లు ఎక్కువ రేటు వేస్తున్నా రనేది మామిడి రైతుల వాదన. నూజివీడు, ఆగిరిపల్లి, విస్సన్నపేట, నున్న మార్కెట్‌లకు ఉత్తరాది రాష్ట్రాల నుంచి సేట్లు కాయల కొనుగోలు నిమిత్తం వస్తారు. వీరు సీజన్‌ కొద్దిరోజులు గడిచిన తర్వాత క్రమేణా ధరను తగ్గిస్తూ చివరకు అతి తక్కువ ధరకు తీసుకువస్తున్నారు. దీనికి తోడు చిత్తూరు జిల్లాలో అధిక శాతం జ్యూస్‌ ఫ్యాక్టరీలు తెరవకపోవడంతో కొనుగోళ్లు అంతగా లేకపోవడం కూడా ధర పతనమవ్వడానికి కారణమని వ్యాపారులు అంటున్నారు.

కనీస మద్ధతు ధర ప్రకటిస్తేనే.. మామిడికాయల ధర నిర్ణయం కొనుగోలు చేసే సేట్‌కు, కమీషన్‌ దుకాణదారుడికి మధ్య ఉంటోంది తప్పితే కాయలను మార్కెట్‌కు తోలుకొచ్చిన రైతు సమక్షంలో నిర్ణయిం చడం లేదు. కమీషన్‌ వ్యాపారి టన్ను ధర ఎంత అంటే అంతే. అలాకాకుండా ప్రభుత్వం మామిడికాయల రకాలను బట్టి టన్నుకు కనీస మద్దతు ధరను ప్రకటించి అంతకంటే తక్కువకు కొనుగోలు చేయడానికి వీల్లేదంటే రైతులకు కొంత మేర ఉపయోగం ఉంటుంది. ఈ ఏడాది 95 శాతానికి పైగా రైతులు నష్టాల పాలైన నేపథ్యంలో తమను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు డిమాండ్‌ చేస్తున్నారు.

పెట్టుబడులు కూడా రావు

తోతాపురి రకం ధర టన్ను రూ.3 వేలకు పడిపోయింది. ఇలా అయితే కోత కూలి, కిరాయి డబ్బులు కూడా రాని పరిస్థితి. 14 ఎకరాల మామిడి తోట ఉండగా రూ.6 లక్షల పెట్టుబడి పెట్టాను. పెట్టుబడులు కాదు కదా.. సగం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు.

– లావు ధనకోటేశ్వరరావు,

కొత్త రావిచర్ల, నూజివీడు మండలం

దారుణంగా ధరల పతనం

టన్ను రూ.15 వేల నుంచి రూ.3 వేలకు తగ్గుదల

మామిడి రైతుల గగ్గోలు

తోతాపురి.. ధర దిగజారి 1
1/1

తోతాపురి.. ధర దిగజారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement