
ఆక్వాలో యాంటీ బయోటిక్స్ వాడొద్దు
ఉండి: రొయ్యలు, చేపల సాగులో యాంటీ బయోటిక్ మందులు వాడరాదని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. మంగళవారం ఎన్నార్పీ అగ్రహారంలోని మత్స్య పరిశోధన కేంద్రంలో ఆక్వా రైతులకు సాగు పద్ధతులు, నిర్వహణ, నైపుణ్యంపై మంగళవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆక్వా కల్చర్లో మంచి యాజమాన్య పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యామ్నాయ జాతుల పెంపకంపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఫిషరీస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, ఎంపెడా అధికారులు, కేవీకే శాస్త్రవేత్తలు, సాంకేతిక సంస్థ ప్రతినిధులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొని ఆక్వా సాగులో అవలంభించే సాంకేతిక పద్ధతులను గురించి పలు సూచనలు సలహాలను వివరించాలని అన్నారు.అనంతరం రొయ్యలకు మేతను వేసేందుకు వినియోగించే డ్రోన్ టెక్నాలజీని కలెక్టర్ నాగరాణి పరిశీలించారు. జిల్లా మత్స్యశాఖ అధికారి కేఎస్వీ నాగలింగాచార్యులు, ఫిషరీష్ యూనివర్సిటీ శాస్త్రవేత్త సుగుణ, కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్ పాల్గొన్నారు.