
నాలుగు నెలల తరువాత తల్లి చెంతకు..
భీమడోలు: మతిస్థిమితం లేక ఇంటి నుంచి వెళ్లిపోయిన మానసిక వికలాంగున్ని పోలీసులు నాలుగు నెలల అనంతరం పట్టుకుని తన తల్లి చెంతకు చేర్చిన ఉదంతమిది. సూరప్పగూడెం పంచాయతీ పరిధిలోని పాతూరుకు చెందిన కొప్పుశెట్టి వెంకన్న(36) మానసిక వికలాంగుడు. అతడిని తల్లి గంగమ్మ కంటికి రెప్పలా కాస్తోంది. అయితే జవనరి 7వ తేదీన మతిస్థిమితం లేక ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంకన్న ముంబైకి వెళ్లిపోయాడు. దిక్కుతోచని స్థితిలో గంగమ్మ తన కుమారుడు వెంకన్న ఆచూకీ కోసం జిల్లా వికలాంగుల సంఘం అధ్యక్షుడు మామిడిపల్లి నాగభూషణంను సంప్రదించించగా ఆయన సహకారంతో భీమడోలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్సై వై.సుధాకర్ వెంకన్న ఆచూకీ కోసం తనదైన శైలిలో కృషి చేశారు. రాష్ట్రంలోని దివ్యాంగుల గ్రూపులో ఫొటోను ఉంచి ఆచూకీ తెలిస్తే తెలియజేయాలని కోరారు. కొన్ని రోజుల తర్వాత ముంబైలోని శరభ ఫౌండేషన్ వారు ముంబై రోడ్లపై తిరుగుతున్న వెంకన్నను పట్టుకుని ఆతనికి వైద్యం చేయించి మందులు అందించారు. కోలుకున్న తర్వాత వెంకన్న శరభ ఫౌండేషన్ వారికి తన అడ్రస్ చెప్పాడు. దీంతో వారు భీమడోలు పోలీసులకు సమచారం అందించారు. మంగళవారం భీమడోలు పోలీస్స్టేషన్లో తల్లి గంగమ్మకు వెంకన్నను అప్పగించారు.