●
అర్హులందరికీ ఇవ్వాలి
ఏడాదికాలంలో కొత్త పింఛన్ల మంజూరు లేదు. వితంతువులకు పింఛన్ ద్వారా భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం కొందరికి మాత్రమే సాయం అందించడం సరికాదు. స్పౌజ్ కోటాతో పాటు అర్హులైన వితంతువులందరికీ పింఛన్లు మంజూరు చేయాలి.
– మెహర్ అన్సారీ, గృహిణి, తణుకు
ఉన్నవాటిని తొలగిస్తున్నారు
కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్న వాటిని తొలగిస్తున్నారు. వితంతువులకు పింఛన్లు వెంటనే మంజూరు చేసే వెసులుబాటు సరళంగా ఉండాలి. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చే వరకు పెన్షన్లు మంజూరు చేయకపోవడం సరికాదు.
– పి.పూర్ణ, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి
సాక్షి, భీమవరం : రఇంటికి జీవనాధారమైన భర్త మరణిస్తే భార్యకు బతుకు భారం కాకుండా వితంతు పింఛన్తో ఆదుకోవాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. భర్త పింఛన్ పొందుతూ మరణిస్తేనే భార్యకు వితంతు పింఛన్ వర్తిస్తుందంటూ కొత్త భాష్యం చెబుతోంది. ఈ మేరకు జిల్లాలో పింఛన్ పొందుతూ 3242 మంది చనిపోగా వారి భార్యలకు మాత్రమే పింఛన్ల జారీకి ఆదేశాలిచ్చింది. మిగిలిన వేలాది మంది నిరుపేద వితంతువులకు మొండిచేయి చూపింది.
25 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్
ఏప్రిల్ నాటికి జిల్లాలో వివిధ సామాజిక పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులు 2,25,718 మంది ఉన్నారు. వీరిలో వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారులు సుమారు 1,26,061 మంది ఉండగా, వితంతువులు 49,564, దివ్యాంగులు 28,025, మత్య్సకారులు, డప్పు కళాకారులు, అభయహస్తం తదితర లబ్ధిదారులు 22,068 మంది ఉన్నారు. 2024 జనవరిలో చివరిగా జిల్లాలోని 4,274 మందికి కొత్త పింఛన్లు ఇచ్చారు. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్త మంజూరును నిలిపేసింది. వితంతు, వృద్ధాప్య, తదితర పింఛన్ల కోసం జిల్లా వ్యాప్తంగా 25 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టు అంచనా. గత ప్రభుత్వంలో ఏటా జనవరి, జూలై నెలల్లో అర్హత కలిగిన వారందరికీ పింఛన్లు అందజేసేవారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 11 నెలల కాలంలో ఒక్క కొత్త పింఛన్ ఇవ్వలేదు. నవంబరు నుంచి మాత్రం పింఛన్ లబ్ధిదారుడు మృతిచెందితే స్పౌజ్ కోటాలో అతని భార్యకు పింఛన్ ఇస్తోంది. అంతకు ముందు చనిపోయిన వారి భార్యలకు స్పౌజ్ కోటాను వర్తింపచేయలేదు.
స్పౌజ్ కోటాలో పింఛన్ సాయం
2023 నవంబరు తర్వాత చనిపోయిన పింఛన్ లబ్ధిదారులు భార్యలకు మాత్రమే స్పౌజ్ కోటాలో పింఛన్ సాయం పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ లబ్ధి పొందేందుకు జిల్లాలో 3,242 మంది ఉన్నట్లు గుర్తించింది. భీమవరంలో 386 మంది ఉండగా, నరసాపురంలో 391, ఉండిలో 490, పాలకొల్లులో 383, ఆచంటలో 521, తణుకులో 498, తాడేపల్లిగూడెంలో 441 మంది ఉండగా గణపవరం మండలంలో 132 మంది ఉన్నారు. వీరిలో 1,929 మంది దరఖాస్తులు రాగా మిగిలిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మిగిలిన 1,313 మందిలో పది శాతం వరకు మృతులు ఉంటారని అధికారులు భావిస్తున్నారు. కొత్తగా వితంతు పింఛన్ కోసం వచ్చిన దరఖాస్తులు 8 వేలకు పైగా ఉంటాయని అంచనా. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్న నిరుపేద వితంతువులకు ప్రభుత్వ నిర్ణయం ఆశనిపాతంలా తయారైంది. తమ భర్తకు పింఛన్ లేదన్న కారణంతో అర్హత ఉన్నా తమకు పింఛన్ మంజూరు చేయకపోవడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో మాదిరి అర్హులైన వారందరికి పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారు.
భర్త పింఛన్ పొందుతూ మరణిస్తేనే భార్యకు వితంతు పింఛన్
లేదంటే ఆ వితంతువుకు మొండిచెయ్యే
జిల్లాలో వితంతు, ఓఏపీ పింఛన్ల కోసం 25 వేలకు పైగా దరఖాస్తులు
3,242 మందికి మాత్రమే స్పౌజ్ కోటాలో సాయం పంపిణీకి నిర్ణయం
పెనుగొండలో నిరుపేద కుటుంబానికి చెందిన ఎన్.సరస్వతి భర్త అనారోగ్యంతో కాలం చేసి ఏడాది కావస్తోంది. వితంతు పింఛన్ కోసం అప్పట్లోనే దరఖాస్తు చేసుకున్నా పింఛన్ రాలేదు. రెండు నెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన వృద్ధుడు మృతి చెందగా ఆయన భార్యకు పింఛన్ మంజూరైంది. సచివాలయ ఉద్యోగులను అడిగితే ఆమె భర్త పింఛన్ పొందుతూ చనిపోవడంతో స్పౌజ్ కోటాలో ఆమెకు పింఛన్ ఇచ్చారని, తన భర్తకు పింఛన్ లేకపోవడంతో తనకు రాలేదని చెప్పారని తెలిపింది. పింఛన్ సాయం అందక బతుకు భారమవుతోందని ఆమె వాపోయింది.
వితంతు పింఛన్లకు మెలిక
వితంతు పింఛన్లకు మెలిక