
వేరుశెనగ కోత తర్వాత జాగ్రత్తలు
చింతలపూడి: దేశంలో పండించే నూనె గింజల పంటల్లో వేరుశెనగ అతి ముఖ్యమైంది. వేరుశెనగ కోతలు పూర్తయ్యాక సరైన జాగ్రత్తలు పాటిస్తే విత్తనాలు రాబోయే కాలంలో పనికొస్తాయి. లేదంటే పుచ్చుపట్టి పనికి రాకుండా పోతాయి. వేరుశనగలో కోసిన పంటను తగిన తేమ (9 శాతం) వచ్చే వరకు మొక్కనుంచి కాయలను వేరు చేయడానికి ముందు ఎండ బెట్టాలి. విత్తనాలను భద్రపరుచుకుని వచ్చే పంటకు ఉపయోగించుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, వేసవిలో అవలంభించాల్సిన పద్ధతుల గురించి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు బి.నాగకుమార్ రైతులకు సూచించారు.
ఎండబెట్టే విధానం
వేరుశెనగ కాయలు పై భాగానికి వచ్చేటట్లు చెట్లను చిన్న, చిన్న కుప్పలుగా వేయాలి. లేదా మొక్కలను కర్రలకు కట్టి కాయలను పక్కలకు వచ్చేలా చేసి ఎండబెట్టుకోవచ్చు.
తేమశాతం తగ్గించడం ఇలా
కాయల్లో తేమ శాతం ఎక్కువగా ఉంటే ఎండలో ఆరబెట్టకుండా తేమను 7, 8 శాతానికి తీసుకురావాలి. వేడి గాలులను వదిలే పరికరాలను ఇందుకు ఉపయోగించవచ్చు. వేరుశెనగ పంటను నిల్వ చేయడానికి ఒకసారి వాడిన సంచులను మళ్లీ వాడకూడదు. పాలిథీన్ పేపర్ ఉన్న గోనె సంచులు బాగా ఎండిన వేరుశెనగ కాయలను నిల్వ చేయడానికి ఉపయోగం.
ఎండలో ఆరబెట్టకూడదు
రబీలో పీకేటప్పుడు ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉంటుంది. కాయలను నేరుగా ఎండలో ఆరబెట్టకూడదు. నీడలో ఆరబెట్టాలి. ఎండ తీవ్రత ఉదయం 11 గంటల వరకు.. సాయంత్రం 4 గంటల తరువాత తక్కువగా ఉంటుంది. ఆయా సమయాల్లో ఆరబెట్టుకోవాలి. ఎండబెట్టే సమయంలో వేరే రకాల కాయలు కలవకుండా చూసుకోవాలి.
నిల్వ చేసుకునే విధానం
విత్తనం కోసం బాగా ముదిరిన కాయలను నిల్వ చేసుకోవాలి. కాయలను కదిలిస్తే ఘల్లుమని శబ్దం రావాలి. అప్పుడే బాగా ఎండినట్లు అర్ధం. కాయలను నిల్వ చేసుకోవడానికి శుభ్రమైన పాలిధిన్ లైనింగ్ ఉన్న గోనె సంచులను వాడాలి. గోనె సంచులను 0.5 శాతం మలాథియాన్ ద్రావణంలో ముంచి బాగా ఆరబెట్టుకోవాలి. దీని వల్ల కాయల్లోని గింజలకు శిలీంధ్రాల బెడద ఉండదు.
బి నాగకుమార్ –సహాయ వ్యవసాయ సంచాలకులు

వేరుశెనగ కోత తర్వాత జాగ్రత్తలు

వేరుశెనగ కోత తర్వాత జాగ్రత్తలు