
ఉప్పుటేరు ఆక్రమణల తొలగింపునకు సహకరించండి
కై కలూరు : వరదల సమయంలో కొల్లేరుకు చేరే నీటిని సముద్రానికి పంపించడానికి ప్రధాన భూమిక వహించే ఉప్పుటేరు ఆక్రమణల తొలగింపునకు అందరూ సహకరించాలని కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఉండి ఎమ్మెల్యే, ఉప సభాపతి కనుమూరి మురళీకృష్ణంరాజు అన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు కొల్లేరు అంశంపై కమిటీ నివేదిక కోరిన నేపథ్యంలో వారు కొట్టాడ గ్రామం వద్ద ఉప్పుటేరు ఆక్రమణలను డ్రోన్ సాయంతో శనివారం పరిశీలించారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉప్పుటేరులో ఆక్రమణల కారణంగా 10 వేల క్యూసెక్కుల నీటిని తరలించే ఉప్పుటేరు 6 వేల క్యూసెక్కులకు పడిపోయిందన్నారు. ఇలానే కొనసాగితే కొల్లేరు ముంపు మరొకసారి తప్పదన్నారు. వర్షాకాలం వచ్చే నాటికీ ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించారు. ఇందుకు ఆక్రమణదారులు డ్రెయినేజీ, రెవెన్యూ, పోలీస్ శాఖలకు సహకరించాలన్నారు. లేనిపక్షంలో చట్టం తన పని చేసుకుంటుందని ఆక్రమణదారులను పరోక్షంగా హెచ్ఛరించారు. త్వరలో సుప్రీంకోర్టు సాధికారత కమిటీ పర్యటనకు వస్తోందని కొల్లేరు ప్రజలు సమస్యలను విన్నవించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ అడవి కృష్ణ, వడ్డీ సాధికారిత రాష్ట్ర కన్వీనర్ బలే ఏసురాజు, కూటమి నేతలు పెన్మత్స త్రినాథరాజు, పూలా రాజీ, కొల్లి బాబీ, సర్పంచులు, కొల్లేరు పెద్దలు పాల్గొన్నారు.