
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
భీమవరం: పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని, ఆశా కార్యకర్తల ఐక్యంగా పోరాడాలని ఎమ్మెల్సీ బి.గోపీమూర్తి పిలుపునిచ్చారు. గురువారం ఆశా వర్కర్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా భీమవరం త్యాగరాజ భవనంలో చింతపల్లి లక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆశా కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సర్వీస్ను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తలకు కనీస సౌకర్యాలు లేవని, ప్రభుత్వం యాప్తో పనిభారం పెంచిందని విమర్శించారు. ఆశా కార్యకర్తలకు గ్రాట్యూటీ, కనీస వేతనాలు లేవని పీఎఫ్, ఈఎస్ఐ ఊసెత్తకుండా ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకుంటోందని గోపీమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జేఎన్వీ గోపాలన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తేస్తున్న లేబర్ కోడ్స్ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా నాయకులు బి. వాసుదేవరావు, డి.కల్యాణి, ఎ.అజయ్ కుమారి, యూనియన్ జిల్లా కార్యదర్శి డి.జ్యోతి, ఎల్ఎస్ కుమారి తదితరులు పాల్గొన్నారు.