నర్సింగ్‌ కాలేజీలో వసూళ్ల పర్వం! | - | Sakshi
Sakshi News home page

నర్సింగ్‌ కాలేజీలో వసూళ్ల పర్వం!

Apr 25 2025 12:55 AM | Updated on Apr 25 2025 1:01 AM

నర్సింగ్‌ కాలేజీలో వసూళ్ల పర్వం!

నర్సింగ్‌ కాలేజీలో వసూళ్ల పర్వం!

ఏలూరు టౌన్‌: ఏలూరు జీజీహెచ్‌ భవనంలో నిర్వహిస్తున్న జీఎన్‌ఎం నర్సింగ్‌ కాలేజీ వసూళ్ల పర్వానికి తెరలేపినట్లు తెలుస్తోంది. అడ్మిషన్ల నుంచి క్యాపింగ్‌ సెర్మనీ వరకు విద్యార్థినుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులు చెల్లించాలంటూ నర్సింగ్‌ విద్యార్థినులపై కాలేజీ యాజమాన్యం వత్తిడి చేస్తూ వేధింపులకు గురిచేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పేదవర్గాల పిల్లలకు వృత్తివిద్యా కోర్సులు అందించేందుకు ప్రభుత్వం జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) మూడున్నర సంవత్సరాల డిప్లమో కోర్సును అందిస్తోంది. ఏలూరు సర్వజన ఆసుపత్రిలో భవనంలోనే ఒక విభాగంలో జీఎన్‌ఎం నర్సింగ్‌ కాలేజీ ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది ప్రభుత్వం కౌన్సిలింగ్‌ ద్వారా అడ్మిషన్లు అందిస్తూ పూర్తి ఉచితంగా జీఎన్‌ఎం కోర్సును పేద వర్గాల విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. మూడున్నరేళ్ల కోర్సుకు సంబంధించి ఒక్కో ఏడాది 60 మందికి అడ్మిషన్లు ఇస్తూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేద వర్గాల పిల్లలకు ఉచితంగా నర్సింగ్‌ కోర్సును అందిస్తూ వారి కాళ్లపై వారు నిలబడి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగు పర్చుకోవటమే ప్రభుత్వ లక్ష్యం. కానీ ఏలూరు జీజీహెచ్‌లోని జీఎన్‌ఎం కోర్సు చదివే విద్యార్థినులతో యాజమాన్యం దారుణంగా ఆటలాడుతూ భారీగా వసూళ్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

భారీగా వసూళ్లు?

ఏలూరు సర్వజన ఆసుపత్రి భవనంలోని జీఎన్‌ఎం నర్సింగ్‌ కాలేజీలో రెండు రోజుల్లో క్యాపింగ్‌ సెర్మనీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సుమారు 240 మంది విద్యార్థినులకు వారి విద్య పూర్తిచేసి ఉత్తీర్ణత సాధించిన నేపథ్యంలో క్యాపింగ్‌ సెర్మనీ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఒక్కో విద్యార్థిని నుంచి రూ.2 వేలు వసూలు చేసేలా యాజమాన్యం టార్గెట్‌ పెట్టినట్లు తెలుస్తోంది. ఇలా జీఎన్‌ఎం నర్సింగ్‌ విద్యార్థినిల నుంచి రూ.4.80 లక్షల సొమ్ములు వసూలు చేసేలా నిర్ణయించారు. కాలేజీ యాజమాన్యం పేరు చెప్పకుండా కాలేజీలోని సీనియర్‌ విద్యార్థినిలకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. నర్సింగ్‌ కాలేజీలోని అధికారులకు బంగారు ఆభరణాలు చేయించాలనీ, ఇతరత్రా ఖర్చులు ఉంటాయనీ, కచ్చితంగా డబ్బులు కట్టాలంటూ వత్తిడి చేస్తున్నారనీ, తమకు తినటానికే డబ్బులు లేకుంటే ఇక రెండు వేలు ఎక్కడి నుంచి తెస్తామంటూ విద్యార్థినుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

పేద విద్యార్థినులను వేధిస్తున్న కాలేజీ యాజమాన్యం

అడ్మిషన్ల నుంచి క్యాపింగ్‌ వరకూ భారీగా వసూళ్లు?

ఏలూరు జీజీహెచ్‌లో జీఎన్‌ఎం నర్సింగ్‌ కాలేజీ దుస్థితి

డబ్బులు ఇవ్వకుంటే.. వేధింపులే

జీఎన్‌ఎం కోర్సు పూర్తి చేయాలంటే తమ కనుసన్నల్లోనే ఉండాలనీ, తాము తలచుకుంటే మీరు పాస్‌ కూడా కారంటూ కాలేజీ యాజమాన్యం నిత్యం విద్యార్థినిలను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ ఉంటారని చెబుతున్నారు. క్యాపింగ్‌ సెర్మనీకి రూ.2వేలు చెల్లించకుంటే మీకు సర్టిఫికెట్లు చేతికి రాకుండా ఎలా చేయాలో తమకు తెలుసంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. వృత్తివిద్యా కోర్సు కావటంతో విద్యార్థినులు సైతం మౌనంగా వేధింపులు భరిస్తూ ఉంటున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement