
శ్రీవారి కొండపై షార్ట్కట్ మార్గం వద్దు
ద్వారకాతిరుమల : శ్రీవారి క్షేత్రంలో కొందరు భక్తులు ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నారు. కొండపైకి షార్ట్కట్ మార్గంలో వెళుతున్నామని అనుకుంటున్నారే గాని, ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటనేది ఆలోచించడం లేదు. వివరాల్లోకి వెళితే. ద్వారకాతిరుమల చినవెంకన్న కొండపైన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానంతరం కొందరు భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సమీపంలోని మార్గం గుండా కొండపైన నిత్యాన్నదాన భవనం, శివాలయం వద్దకు కాలినడకన వెళుతున్నారు. అయితే అటుగా వెళ్లకూడదని ఆలయ అధికారులు ఆ మార్గంలో ఎన్ని అడ్డం పెట్టినా, వాటిని దాటుకుని మరీ భక్తులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో జేసీబీతో పూడిక పనులు జరుగుతున్నాయి. భక్తులు షార్ట్కట్ మార్గాల్లో వెళ్లకుండా జంటగోపురాల వద్దకు చేరుకుని, అక్కడి నుంచి దేవస్థానం ఉచిత బస్సుల ద్వారా నిత్యాన్నదాన భవనం, శివాలయం, బస్టాండ్లకు చేరుకోవాలని ఆలయ అధికారులు సూచిస్తున్నారు. అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రాంతాల వైపు వెళ్లొద్దని కోరుతున్నారు.
అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రాంతంలో నుంచి భక్తుల రాకపోకలు
షార్ట్కట్ మార్గాలు వినియోగించవద్దంటున్న అధికారులు