కలెక్టర్ నాగరాణి
వీరవాసరం: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం పక్కాగా పూర్తిచేయాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. వీరవాసరం ఎంఆర్కే జిల్లాపరిషత్ హైస్కూల్లో మూల్యాంకన ప్రక్రియను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ జిల్లాలకు చెందిన 9 సబ్జెక్టులకు సంబంధించి 1,69,341 జవాబు పత్రాలు జిల్లాకు వచ్చాయన్నారు. 102 మంది చీఫ్ ఎగ్జామినర్స్, 612 మంది సహాయ ఎగ్జామినర్స్, 204 మంది స్పెషల్ అసిస్టెంట్లు మొత్తంగా 918 మంది డీఈఓ ఈ.నారాయణ పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. మూల్యాంకనం ప్రక్రియ సుమారు వారం పాటు సాగుతుందని, లోటుపాట్లకు తావులేకుండా ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి ఉన్నారు.
నీట్ పరీక్షలకు రెండు కేంద్రాలు
భీమవరం: జిల్లాలో మే 4న నిర్వహించే నీట్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్ నుంచి పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 2,100 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని, తాడేపల్లిగూడెంలోని ఎన్ఐటీ, శశి కాలేజీల్లో కేంద్రాలు ఏర్పాటుచేశారన్నారు. పరీక్షలు ఆఫ్లైన్లో జరుగుతాయని, కేంద్రాలను పరిశీలించి ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లా అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, డీఈఓ ఈ.నారాయణ, పరీక్షల నిర్వహణ జిల్లా నోడల్ అధికారి ఎన్.జయరాం, ఎన్ఐటీ సూపరింటెండెంట్ ఆఫ్ ఎగ్జామ్స్ డాక్టర్ ఎన్.సునీల్ కుమార్, తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాథ్ పాల్గొన్నారు.