
దళారుల దందా
రేషన్ కార్డులు మంజూరు చేయిస్తామని చేతివాటం
హన్మకొండ అర్బన్: పేదల అవసరాన్ని ఆసరాగా చేసుకుని దళారులు అందిన కాడికి దండుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు పదేళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులకు అనుమతి ఇవ్వడంతో అర్హులంతా మీ సేవలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఒక్కో మండలానికి రోజూ వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తుండడంతో అధికారులు విచారణ చేయడంలో కొంత జాప్యం జరుగుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని దళారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దీనికి తోడు సందట్లో సడేమియా అన్నట్లు కొందరు అవినీతికి అలవాటు పడిన మీ సేవ కేంద్రాల నిర్వాహకులు దరఖాస్తు చేయడంతో పాటు కార్డు కూడా ఇప్పిస్తామంటూ ఆఫర్లు ప్రకటించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో నెత్తీనోరు బాదుకోవడం పేదల వంతవుతోంది.
రెవెన్యూ ఉద్యోగులపైనే ఫిర్యాదులు..
జిల్లా కేంద్రంలో రేషన్ కార్డులతో పాటు ఇతర కులం, నివాసం, ఆదాయం వంటి పత్రాల కోసం నిత్యం రెవెన్యూ కార్యాలయాల్లో మీ సేవ కేంద్రాల వద్ద దళారులు తిష్ట వేసుకుంటున్నారు. తాము చెప్పిన పని చేయకపోతే రెవెన్యూ ఉద్యోగులపైనే ఏకంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్న ఘటనలు అధికారులను విస్మయానికి గురిచేస్తున్నాయి. తాజాగా హనుమకొండ మండల కార్యాలయంలో పనిచేసే డాటా ఎంట్రీ ఆపరేటర్పై ఏకంగా ఒక దళారి కలెక్టర్కే ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అప్పటికే అతడి పరిస్థితి గమనించిన అధికారులు సదరు వ్యక్తి తీరుపై విస్మయానికి గురయ్యారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇలాంటివి హనుమకొండ, హసన్పర్తి, కాజీపేట మండల కార్యాలయాల్లో నిత్యకృత్యం. ఇక కొన్ని మీసేవ కేంద్రాల్లో పనిచేసే వారైతే రూ.5 వేలు ఇస్తే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయడంతో పాటు అప్రూవల్ చేయించి ఇస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు. ఈవిషయం అధికారుల దృష్టికి వచ్చినా చర్యలు తీసుకోకుండా వదిలేయడం ఆరోపణలకు ఆస్కారం ఇస్తోంది.
కార్డు రాదనే భయంతో..
పదేళ్ల తర్వాత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం ఇచ్చింది. అయితే ఇప్పుడు రాకపోతే ఇంకా ఎన్నేళ్లు ఎదురు చూడాల్సి వస్తుందోనన్న ఆందోళన పేదల్లో నెలకొంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అడిగినంత ఇచ్చి పని చేయించుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈసారి ఫుడ్ సెక్యురిటీ కార్డు ఒకటి పకడ్బందీగా జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్ వ్యక్తులతో కాకుండా కేవలం రెవెన్యూ సిబ్బందితో మాత్రమే విచారణ చేయిస్తోంది. వీరిలో కూడా కొందరు దరఖాస్తుదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈవిషయంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. ఒకవైపు ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతుండడంతో మళ్లీ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోతుందని పేదలు ఆందోళన చెందుతున్నారు. ఈవిషయంలో అధికారులు స్పందించి దళారుల బెడద నివారించి కొత్త కార్డులు పారదర్శకంగా జారీ చేయాలని కోరుతున్నారు.
సమస్య ఉంటే నేరుగా ఆఫీసుకు రండి..
కార్యాలయానికి రేషన్ కార్డుల దరఖాస్తులతో వస్తున్న వ్యక్తులే పదేపదే రావడం గమనిస్తున్నాం. వీరి విషయంలో ప్రత్యేకంగా నిఘా పెట్టి వాటిని సమగ్రంగా విచారణ చేస్తున్నాం. ఈవిషయంలో దళారులను అరికట్టేందుకు పోలీసు వారికి ఫిర్యాదు చేసేందుకు చూస్తున్నాం. పేద ప్రజలు రేషన్ కార్డుల కోసం దళారులను ఆశ్రయించవద్దు ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు. అన్ని ధ్రువపత్రాలు ఉంటే అధికారులు ఇంటికి వచ్చి విచారణ చేస్తారు. లేదంటే కార్యాలయానికి వస్తే నేరుగా అధికారులను కలవండి. రేషన్ కార్డు పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా కార్యాలయంలో ఫిర్యాదు చేయండి.
– రంజిత్కుమార్,
హనుమకొండ ఇన్చార్జ్ తహసీల్దార్
జిల్లాలో మొత్తం రేషన్
కార్డులు: 2,28,097
(జనవరి 2025 వరకు)
కొత్తగా అప్రూవల్ అయినవి:
3,419
(జనవరి నుంచి జూన్ 1 వరకు)
రెవెన్యూ సిబ్బందిపైనే ఫిర్యాదులు
వారు చెప్తేనే చేయాలని హుకుం
కొన్ని మీసేవ కేంద్రాల్లో చేతివాటం
రూ.5 వేలు ఇస్తే
రేషన్ కార్డు అంటూ ఆఫర్లు

దళారుల దందా

దళారుల దందా