
జాల కుంటలో మట్టి తవ్వకాలు
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. చెరువులు, కుంటలు తేడా లేకుండా యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేపడుతోంది. అనుమతులు లేకుండా మట్టి తవ్వి విక్రయిస్తూ కొందరు అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. మండలంలోని ముస్తఫాపూర్ గ్రామ శివా రులోని జాలకుంటలో ఓ సంస్థకు చెందిన వారు కొద్ది రోజులుగా మట్టి తవ్వుతున్నారు. హిటాచీలతో కుంటను చెరబట్టి టిప్పర్లతో అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నారు. కుంట నుంచి దాదాపు 500ల టిప్పర్లకు పైగా మట్టిని తరలించారు. జాల కుంటకు సంబంధించి ఇన్ప్లో, అవుట్ ఫ్లోను పూర్తిగా ధ్వంసం చేయడంతో పాటు వన్యప్రాణులకు రక్షణ లేకుండాపోయింది. దీంతో మట్టి మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది.
సీజ్ చేసిన టిప్పర్లు మాయం!
జాలకుంటలో అక్రమ మట్టి తవ్వకాల విషయం తెలుసుకున్న ఇరిగేషన్ శాఖ డీఈ సుధాకర్ తన సిబ్బందితో మంగళవారం కుంటను పరిశీలించారు. ఈసందర్భంగా కుంట వద్ద ఉన్న రెండు హిటాచీలు, ఆరు టిప్పర్లను సీజ్ చేసి స్థానిక రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులకు అప్పగించినట్లు ఇరిగేషన్ డీఈ సుధాకర్ తెలిపారు. కానీ, సీజ్ చేసిన టిప్పర్లు గంటల వ్యవధిలోనే మాయం కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనిపై ఇరిగేషన్ శాఖ డీఈ సుధాకర్ను వివరణ కోరగా.. రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు సహకరించడం లేదని మీడియాకు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ మట్టి అక్రమార్కులకు అధికారులు సహకరిస్తున్నారా? లేక ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారా? అనే సందేహాలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మట్టి అక్రమ రవాణా వెనుక బడా నాయకుల హస్తం ఉన్నట్లు సమాచారం.
ఆరుటిప్పర్లు, రెండు హిటాచీలు సీజ్!
గంటల వ్యవధిలోనే సీజ్ చేసిన
వాహనాలు మాయం

జాల కుంటలో మట్టి తవ్వకాలు