వరంగల్ క్రైం: డ్రగ్స్ రహిత వరంగల్ పోలీస్ కమిషనరేట్గా గుర్తింపు సాధించడమే మనందరి లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకుని డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్పోస్టర్లను మంగళవారం సీపీ ఆవిష్కరించారు. ఈసందర్భంగా సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలను సమాజం నుంచి తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. వారోత్సవాల్లో భాగంగా విద్యాసంస్థల్లో, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో డ్రగ్స్పై అవగాహన కల్పించడంతో పాటు, ర్యాలీలు, డ్రాయింగ్, వ్యాస రచన పోటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినా, వినియోగించినా 87125 84473 నంబర్లో సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, సీసీఆర్బీ ఏసీపీ డేవిడ్ రాజు, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
కేయూ వీసీని కలిసిన రీసెర్చ్ ప్రాజెక్ట్ సభ్యులు
కేయూ క్యాంపస్ : రుసా 2.0 ప్రాజెక్ట్ కింద మంజూరైన ‘సెంటర్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ మెటీరియల్స్’ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఫెల్లోస్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకట్రామ్రెడ్డితో కలిసి మంగళవారం కేయూ వైస్ చాన్స్లర్ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రంను మర్యాద పూర్వకంగా కలిశారు. రుసా 2.0లో భాగంగా ఐదు కేంద్రాల్లో ఒకటిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సెంటర్లో అధిక ప్రభావం చూపే మంచి జర్నల్స్లో మెరుగైన ఫలితాలను ప్రచురించడానికి, నాణ్యమైన పరిశోధన నిర్వహించాలని వీసీ ప్రతాప్రెడ్డి.. ప్రాజెక్ట్ ఫెల్లోలకు సూచించారు. కార్యక్రమంలో శ్రీలత, అడిషనల్ కంట్రోలర్ డాక్టర్ పద్మజ, విభాగాధిపతి మంజుల, నరేందర్, రాజు, శ్రీలత, నర్సింహులు పాల్గొన్నారు.
నేడు, రేపు స్పోర్ట్స్ స్కూల్స్లో ప్రవేశాలకు ఎంపిక
వరంగల్ స్పోర్ట్స్: హైదరాబాద్లోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లోని క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ డీవైఎస్ఓ గుగులోతు అశోక్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25, 26 తేదీల్లో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జిల్లా స్థాయి ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. మండల స్థాయిలో ఎంపికై న విద్యార్థులు మాత్రమే పాల్గొనాలని సూచించారు. జిల్లా స్థాయిలో ఎంపికై న విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో మరోసారి సెలక్షన్స్ ఉంటాయని అందులో అర్హత సాధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎంపిక పోటీలకు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట ఆధార్కార్డు, బోనోఫైడ్, కుల, జనన ధ్రువీకరణ పత్రాలు, మూడో తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్తో పాటు 10 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో ఉదయం 8గంటలకు జేఎన్ఎస్ వద్ద హాజరుకావాలని సూచించారు.
వేయిస్తంభాల ఆలయ హుండీ ఆదాయం రూ.15,39,722
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో మంగళవారం ఉదయం హుండీ లెక్కించారు. హుండీ ఆదాయం రూ.7,47,722, పూజా రుసుముల ద్వారా రూ.7,92,000గా నమోదైందని, మొత్తం ఆదాయం రూ.15,39,722గా నమోదైందని దేవాలయ ఈఓ ధరణికోట అనిల్కుమార్ తెలిపారు. సరస్వతీ పుష్కరాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించి స్వామివారికి పూజలు నిర్వహించుకున్నందున అధిక ఆదాయం నమోదైందని ఈఓ తెలిపారు. పర్యవేక్షకులుగా దేవాదాయశాఖ పరిశీలకులు ప్రసాద్ వ్యవహరించారు. దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, సిబ్బంది మధుకర్, రామకృష్ణ, రజిత, హనుమకొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది, వేంకటేశ్వర సేవా సమితి మహిళా భక్తులు పాల్గొన్నారు.

డ్రగ్స్ రహిత కమిషనరేటే లక్ష్యం