
పీవీ విజ్ఞాన కేంద్రం పనులు పూర్తి చేయండి
ఎల్కతుర్తి: పీవీ విజ్ఞాన కేంద్రం పనులను ఈనెల 26 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. భీమదేవరపల్లి మండలం వంగరలో నిర్మిస్తున్న వీవీ విజ్ఞాన కేంద్రం నిర్మాణ పనుల్ని మంగళవారం ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా విజ్ఞాన కేంద్రంలో తుది దశకు చేరుకున్న మ్యూజియం, అంపి థియేటర్, ఆర్ట్ గ్యాలరీ, ప్రాంగణాన్ని కలెక్టర్ పరిశీలించి పర్యాటక అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజ్ఞాన కేంద్రం ఆవరణలో మొక్కలు నాటాలని, గ్రీనరీ సిద్ధం చేయాలన్నారు.
‘రైతుకు భరోసా’పై వీడియో కాన్ఫరెన్స్
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందజేసిన సందర్భంగా హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇతర మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని రైతు వేదిక నుంచి మండలంలోని వివిధ గ్రామాల రైతులతో కలిసి కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రసంగాన్ని వీక్షించారు. కార్యక్రమంలో డీఏఓ రవీందర్సింగ్, గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను, ముల్కనూరు సొసైటీ అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి, తహసీల్దార్ రాజేశ్, ఎంపీడీఓ వీరేశం, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
ఎరువుల గోదాం పరిశీలన
ముల్కనూరులోని ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎరువుల గోదాంను మంగళవారం కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. వీటికి సంబంధించిన రికార్డులు పరిశీలించారు. ఆమె వెంట స్థానిక తహసీల్దార్ రాజేశ్, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
23 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
హన్మకొండ అర్బన్: వన మహోత్సవం సందర్భంగా జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో 23 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. మంగళవారం ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ప్రభుత్వ వివిధ ప్రాధాన్యతా కార్యక్రమాలపై కలెక్టర్లతో వీసీ సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ స్నేహ శబరీష్