
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు..
జిల్లాలో మధుమేహం, క్షయ వ్యాధిగ్రస్తుల వైద్య పరీక్షలు పూర్తిచేసి వివరాలు ప్రత్యేక యాప్లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్యశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మొదటి విడతలో 5 ప్రాథమిక కేంద్రాల పరిధిలో మధుమేహం పరీక్షలు ఎంతమందికి నిర్వహించారు? వివరాల ఆన్లైన్ నమోదు ఎంతవరకు వచ్చిందనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మధుమేహం లక్షణాలు గుర్తించిన 19,300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వారి వివరాలు ఫోన్నంబర్తో సహా ప్రత్యేక యాప్లో పొందుపర్చామన్నారు. అదేవిధంగా 594 మంది క్షయ వ్యాధిగ్రస్తుల వివరాలు సైతం నమోదు చేసినట్లు వైద్యాధికారులు వివరించారు. గర్భిణులు ఎప్పుడు వైద్య పరీక్షలకు వెళ్లాలి.. ఐదేళ్లలోపు పిల్లలకు ఏ టీకా ఎప్పుడూ వేయించాలనే వివరాలు పిల్లల తల్లుల సెల్ఫోన్లకు ప్రతినెల సంక్షిప్త సమాచారం పంపించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రోగ్రాం అధికారిని ఆదేశించారు. వారి పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. పాఠశాలలు పునః ప్రారంభమైనందున ఆర్బీఎస్కే ద్వారా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, అదేవిధంగా ఉపాధ్యాయులు, వంట, ఇతర పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, ప్రోగ్రాం అధికారులు డా. సాయినాథ్ రెడ్డి, డా. రామచందర్రావు, డా. పరిమళ తదితరులు పాల్గొన్నారు.