
నేర రహిత సమాజమే ధ్యేయం : ఎస్పీ
వనపర్తి: నేర రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా అధికారులు, సిబ్బంది సమష్టిగా పని చేయాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని పోలీసు అధికారులతో ఎస్పీ నెలవారి నేర సమీక్ష నిర్వహించారు. ఆయా పోలీస్స్టేషన్లలో నమోదైన కేసులు, విచారణలో అధికారులు సేకరిస్తున్న ఆధారాలను పరిశీలించారు. యాక్సిడెంట్, మిస్సింగ్, దొంగతనం కేసుల దర్యాప్తులో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. రాబోయే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సిబ్బంది ప్రతి ఒక్కరూ గ్రామస్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకొని వీపీఓ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. మండల పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలని.. విధుల్లో నిర్లక్ష్యం సరికాదని హెచ్చరించారు. పోలీస్స్టేషన్లలో రిసెప్షన్, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని.. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ సమస్యలను త్వరగా పరిష్కరించి పోలీసులపై నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండాలని, ప్రతి రికార్డును కచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలిస్తామని చెప్పారు. ఠాణా ఆవరణలో అనవసర వాహనాలు లేకుండా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉ న్న కేసులను పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఆత్మకూర్, వనపర్తి సీఐలు శివకుమార్, కృష్ణయ్య, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి, జిల్లాలోని ఎస్ఐలు, డీసీఆర్బీ, ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.