
‘మత్తు’ నియంత్రణకు పకడ్బందీ చర్యలు
వనపర్తి: జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు ఉత్పత్తి, వినియోగం జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి నార్కోటిక్, నషా ముక్త్ భారత్ సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరగగా.. సంబంధిత శాఖల నుంచి నివేదిక తీసుకోవడంతో పాటు బాధ్యతలను అప్పగించారు. పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో ఉన్న క్యాంటీన్లు, పాన్ డబ్బాలు, మద్యం దుకాణాల్లో తరచూ తనిఖీలు నిర్వహిస్తూ నిఘా ఉంచాలని ఎకై ్సజ్శాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కళాశాలల్లో ఏర్పాటు చేసిన 222 యాంటీ డ్రగ్ కమిటీలను క్రియాశీలకంగా మార్చి ప్రతి నెల మొదటి శుక్రవారం సమావేశాలు నిర్వహించడంతో పాటు విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియట్ నోడల్ అధికారిని ఆదేశించారు. యాంటీ డ్రగ్ కమిటీ సమావేశాలకు జిల్లా అధికారులు హాజరుకావాలని, అప్పుడప్పుడు తాను సైతం వస్తానని తెలిపారు. పీహెచ్సీలకు అనారోగ్యంతో వచ్చే యువతను నిశితంగా పరిశీలించి మత్తు పదార్థాల అలవాటు ఉందా అనే విషయాలను గుర్తించాలని వైద్యశాఖ అధికారులకు సూచించారు. పత్తి, జొన్న తదితర పంటల సాగులో అక్కడక్కడ గంజాయి పండించే అవకాశాలు ఉంటాయని.. వ్యవసాయ విస్తరణ అధికారులు గట్టి నిఘా ఉంచాలని, అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. గర్భిణులు కల్తీ కల్లు తాగడంతో ఆరోగ్యం పాడవడంతో పాటు పుట్టబోయే పిల్లలపై దాని ప్రభావం ఉంటుందని.. తాగకుండా అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ.. 2017 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 22 మాదక ద్రవ్యాల కేసులు నమోదయ్యాయని తెలిపారు. 2025లో వనపర్తిలో 2, గోపాల్పేట మండలంలో 2, పెబ్బేరులో ఒక కేసు నమోదైందన్నారు. మాదక ద్రవ్యాలు వినియోగించినా, సరఫరా చేసినా, గంజాయి పండించినా చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత మత్తు బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత అధ్యాపకులు, తల్లిదండ్రులపై ఉందన్నారు. ఒంటరిగా ఉండటం, కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడకపోవడం, కళాశాలకు తరచూ డుమ్మా కొట్టడం, అకస్మాత్తుగా కోపానికి రావడం, ప్రవర్తనలో మార్పులు గమనిస్తే కౌన్సెలింగ్ ఇప్పించాలని సూచించారు. సమావేశంలో ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదరపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఆర్డీఓ ఉమాదేవి, డీఎస్పీ ఉమామహేశ్వరరావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్నాయక్, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.