
మత్తుకు బానిసైతేభవిష్యత్ నాశనం
ఆత్మకూర్: విద్యార్థులు, యువత మత్తుకు బానిసై తమ బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని.. దూరంగా ఉండాలని ఆత్మకూర్ జూనియర్ సివిల్కోర్టు న్యాయమూర్తి శిరీష కోరారు. శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డ్రగ్స్, ధూమపానం, మద్యం లాంటి చెడు అలవాట్లకు యువత ఆకర్శితులై బానిసలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చదువుపై దృష్టిసారించి దేశం గర్వించేస్థాయికి ఎదగాలని, గ్రామాల్లో సైతం మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని సూచించారు. బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా, బాలల హక్కులకు భంగం కలిగించే వారికి చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రిన్సిపాల్ భాగ్యవర్ధన్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీకే రాములు, ప్రధానకార్యదర్శి ముక్తేశ్వర్, సీనియర్ న్యాయవాదులు తిప్పారెడ్డి, రామేశ్వర్రెడ్డి, నారాయణగౌడ్, అధ్యాపకులు టీజే విశ్వేశ్వర్, కురుమూర్తి పాల్గొన్నారు.
నిండుకుండలా రామన్పాడు
మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో శనివారం పూర్తిస్థాయి నీటిమట్టం సముద్ర మట్టానికిపైన 1,021 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, కుడి కాల్వల ద్వారా 550 క్యూసెక్కుల వరద వస్తుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని చెప్పారు. ఇదిలా ఉండగా జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 800 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 45, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు వినియోగిస్తున్నట్లు వివరించారు.
19.6 అడుగులకు కేఎస్పీ నీటిమట్టం..
దేవరకద్ర: కోయిల్సాగర్ నీటిమట్టం శనివారం సాయంత్రం వరకు 19.6 అడుగులకు చేరింది. కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా జూరాల నుంచి ఒక పంపును రన్ చేసి నీటిని విడుదలను కొనసాగిస్తున్నారు. జూరాల నుంచి నీరు రాక ముందు 11 అడుగులుగా ఉన్న నీటి మట్టం 8.6 అడుగులు పెరిగింది. పాత అలుగు స్థాయి 26.6 అడుగులు కాగా.. ప్రాజెక్టు పూర్తి స్థాయి గేట్ల లేవల్ వరకు నీటి మట్టం 32.6 అడుగులుగా ఉంది.
‘కేంద్ర పథకాలనుప్రజల్లోకి తీసుకెళ్లాలి’
వీపనగండ్ల: కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తోందని.. ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని బీజేపీ కొల్లాపూర్ నియోజకవర్గ నాయకుడు ఎల్లేని సుధాకర్రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రామమందిర నిర్మాణం, 370 ఆర్టికల్ రద్దు, మహిళలుకు 33 శాతం రిజర్వేషన్, ట్రిబుల్ తలాక్ లాంటి అనేక సమస్యలను పరిష్కరించిందని వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం మండల కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్చంద్ర, కిసాన్మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శేఖర్గౌడ్, పార్టీ మాజీ మండల అఽధ్యక్షుడు నారాయణ, జిల్లా కౌన్సిల్ సభ్యుడు నరేష్, రాకేష్యాదవ్, కృష్ణ, రవిగౌడ్, రాఘవేంద్ర పాల్గొన్నారు.

మత్తుకు బానిసైతేభవిష్యత్ నాశనం