
నేడు సాయిచంద్ విగ్రహావిష్కరణ
అమరచింత: పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఆదివారం గిడ్డంగులశాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్, జానపద కళాకారుడు సాయిచంద్ విగ్రహావిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు విగ్రహాన్ని ఆవిష్కరించనుండగా.. ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కళాకారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీసంఖ్యలో హాజరు కానున్నారు. బహిరంగ సభ నిర్వహణకు కావాల్సిన స్థలంతో పాటు సౌకర్యాలు కల్పించారు. కార్యక్రమానికి వచ్చిన వారికి భోజన వసతి కల్పించనుండగా.. నిర్వహణ ఏర్పాట్లు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి.
ఫ అమరచింతలో పుట్టి పెరిగిన వేద సాయిచంద్ తన తండ్రి వెంకట్రాములు గానాన్ని వారసత్వంగా స్వీకరించి తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలతో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. విద్యార్థి దశ నుంచే విప్లవ పాటలకు అకర్షితుడై పీడీఎస్యూ, అరుణోదయ కళాకారుడిగా అరంగేట్రం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ కోసం చేపట్టిన ఉద్యమంలో తమ కళాకారులతో కలిసి ఎన్నో జిల్లాల్లో ధూంధాం కార్యక్రమాలు నిర్వహంచి తన గానంతో ప్రతి ఒక్కరి హృదయంలో చెరగని ముద్ర వేసుకున్నారు. శ్రీకాంతాచారి స్మారక సభలో సాయిచంద్ పాడిన ‘రాతి గుండెలో కొలువైన శివుడా..’ అన్నపాట ప్రతి తల్లి హృదయాన్ని కలిచి వేసింది. 2023, జూన్ 20న రాష్ట్ర గిడ్డంగులశాఖ కార్పొరేషన్ చైర్మన్గా కొనసాగుతున్న సమయంలో గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. రెండో వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలో ఆయన విగ్రహ ఏర్పాటుకు సతీమణి రజనీ సాయిచంద్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నెల రోజులుగా పట్టణంలో పర్యటిస్తూ ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు.
హాజరుకానున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు

నేడు సాయిచంద్ విగ్రహావిష్కరణ