
బోనస్.. బకాయి
జిల్లాలో యాసంగి కొనుగోళ్లు పూర్తయినా ప్రారంభం కాని చెల్లింపులు
● 17,900 మంది రైతులు.. రూ.48.92 కోట్లు పెండింగ్
● వానాకాలం సాగుకు
సన్నద్ధమవుతున్న అన్నదాతలు
● డబ్బుల కోసం ఎదురుచూపులు
వనపర్తి: జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయినా.. ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి చెల్లిస్తామన్న బోనస్ క్వింటాకు రూ.500 చెల్లింపులు ఇంకా ప్రారంభం కాలేదు. గతేడాది వానాకాలంలో ధాన్యం డబ్బులతో పాటే బోనస్ సైతం రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసిన సర్కార్.. యాసంగి సీజన్ బోనస్ చెల్లింపులో ఎందుకు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందో అధికారులకు సైతం తెలియకపోవడం శోచనీయం. నిత్యం ఏదో ఒకచోట రైతులు ఈ విషయాన్ని అధికారులను ప్రశ్నిస్తున్నా.. ప్రభుత్వం వద్దనే పెండింగ్ అనే సమాధానమిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మొత్తం 2.80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేస్తే.. అందులో సుమారు లక్ష మెట్రిక్ టన్నులు సన్నరకమే ఉంది. దీంతో భారీ మొత్తంలో రైతులకు బోనస్ డబ్బులు చెల్లించాల్సి వస్తోంది.
పెరిగిన సన్నాల సాగు..
యాసంగి సీజన్లో జిల్లావ్యాప్తంగా 17,900 మంది రైతుల నుంచి సుమారు లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం వరి ధాన్యం కొనుగోలు చేశారు. వారికి ధాన్యం డబ్బుల చెల్లింపుతో పాటు అదనంగా క్వింటాకు రూ.500 బోనస్ రూపంలో సుమారు రూ.48.92 కోట్ల మేర చెల్లించాల్సి ఉంటుందని అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. జిల్లా రైతులు కొన్నేళ్లుగా వానాకాలం సీజన్లో మాత్రమే ఎక్కువగా సన్నాలు సాగు చేసేవారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు సన్నాలకు బోనస్ అందిస్తామని చెప్పడంతో పాటు గతేడాది వానాకాలంలో ధాన్యం డబ్బులతో పాటు బోనస్ సైతం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. దీంతో యాసంగిలో రైతులు పెద్దఎత్తున సన్నాలు పండించారు. గతేడాది వానాకాలంలో సుమారు రూ.10 కోట్ల మేర బోనస్ చెల్లిస్తే.. యాసంగిలో ఆ మొత్తం ఏకంగా రూ.48.92 కోట్లుకు చేరిందంటే ఎంత విస్తీర్ణంలో సన్నాలు సాగు చేశారో అర్థమవుతుంది.
వానాకాలంలో మరింత పెరుగుదల..
గతంతో పోలిస్తే.. ప్రస్తుత వానాకాలం సీజన్లో సన్నాల సాగు జిల్లావ్యాప్తంగా మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పెరిగిన సాగునీటి వనరులు, స్వల్పకాలికాల్లోనూ సన్నాల రకం విత్తనాలు అందుబాటులోకి రావటమే ఇందుకు కారణమని వారు భావిస్తున్నారు.
రూ.1.90 లక్షలు రావాలి..
బోనస్ వస్తుందనే ఆశతో యాసంగి సీజన్లో 15 ఎకరాల్లో సన్నరకం వరి సాగు చేశా. మొత్తం 380 క్వింటాళ్లు విక్రయిస్తే ఇందుకు సంబంధించిన డబ్బులు బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. బోనస్ డబ్బులు రూ.1.90 లక్షలు రావాల్సి ఉంది. ఎప్పుడు వేస్తారని ఎదురుచూస్తున్నా.
– శేషిరెడ్డి, చెన్నూరు
(గోపాల్పేట)
త్వరగా చెల్లించాలి..
సన్నరకం వడ్లు వేస్తే క్వింటాకు రూ.500 ఇస్తమని ప్రభుత్వం చెప్పడంతో యాసంగిలో కొంత పొలం దొడ్డు రకం, కొంత పొలం సన్నరకం సాగు చేశా. సన్న రకం వరి 30 క్వింటాళ్లు పండితే కొనుగోలు కేంద్రంలో విక్రయించా. ఇప్పటి వరకు నాకు ఒక్క రూపాయి కూడా బోనస్ రాలేదు. త్వరగా చెల్లిస్తే వానాకాలం పంటల సాగుకు ఉపయోగపడతాయి.
– భద్రయ్య, తిర్మలాయపల్లి (ఖిల్లాఘనపురం)
ప్రభుత్వానికి నివేదించాం..
జిల్లావ్యాప్తంగా యాసంగిలో రైతులకు చెల్లించాల్సిన బోనస్ వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. త్వరలోనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యం విక్రయించిన రైతుల బ్యాంకు ఖాతాలో బోనస్ డబ్బులు జమ అవుతాయి. ఈ విషయంలో రైతులకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. – ఆదర్శ్ సురభి, కలెక్టర్

బోనస్.. బకాయి

బోనస్.. బకాయి

బోనస్.. బకాయి

బోనస్.. బకాయి