
విద్యాశాఖలో డీసీఈబీ రగడ!
వనపర్తి టౌన్: జిల్లా విద్యాశాఖలో డీసీఈబీ (డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు) కార్యదర్శి కొనసాగింపుపై రగడ మొదలైంది. ఈ పోస్టు కోసం పలువురు ప్రధానోపాధ్యాయులు పోటీ పడుతుండగా.. వారికి ఆయా ఉపాధ్యాయ సంఘాల నాయకులు, అధికార పార్టీ నేతలు సహకరిస్తూ పోటాపోటీగా పాపులు కదుపుతుండటంతో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఏడాదికి సుమారు రూ.30 లక్షల వరకు విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో వసూలు కావడం.. వీటి వినియోగానికి డీఈఓ, డీసీఈబీ కార్యదర్శి అధికారం ఉండటంతో ఈ పోస్టుకు డిమాండ్ పెరిగి తమ వర్గానికి చెందిన వారికే కేటాయించాలంటూ ఎమ్మెల్యే, మంత్రితో సిఫారస్ చేయడం విస్మయం కలిగిస్తోంది.
● డీఈఓ డీసీఈబీ కార్యదర్శి నియామకంతో పాటు పలువురు ప్రభుత్వ గజిటెడ్ ఉపాధ్యాయులు, ఇద్దరు లేదా ముగ్గురు ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ మూడు, ఆరు నెలలకొకసారి సమావేశమై నిధుల వినియోగంపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నిధుల వినియోగానికి చెక్ పవర్ డీఈఓ, డీసీఈబీ కార్యదర్శికి ఉండటంతో ఈ పోస్టు దక్కించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇదీ కథ..
జిల్లా ఏర్పాటు అనంతరం 2017 నుంచి ఇప్పటి వరకు డీసీఈబీ సెక్రటరీగా జిల్లాకేంద్రంలోని దళితవాడ జీహెచ్ఎం సూర చంద్రశేఖర్ కొనసాగుతున్నారు. ఈయనతో పాటు గతంలో విధులు నిర్వర్తించిన ఏఎంఓ సైతం అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఎనిమిదేళ్లుగా ఒక్కరినే ఎలా కొనసాగిస్తారని, మరొకరికి అవకాశం ఇవ్వాలని డీఈఓకు ఫిర్యాదులు వచ్చాయి. డీసీఈబీని తాను కాపాడానని, తననే కొనసాగించాలంటూ ప్రస్తుత కార్యదర్శి పట్టుబడుతున్నారు. బాధ్యతల నుంచి తప్పిస్తే డీఈఓ కార్యాలయంలో జరిగే సమావేశాల్లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో ఈ పదవిపై ఆయన ఆసక్తి కనబరుస్తున్నారన్న విమర్శలున్నాయి. దీనికితోడు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుంటుండటంతో ఉత్కంఠ నెలకొంది. ఈ వివాదం కలెక్టర్ చెంతకు చేరడంతో నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.
ఫీజుల వసూలు ఇలా..
ఎనిమిదేళ్లుగా ఒకే వ్యక్తిని కొనసాగించడంపై విమర్శలు
ఉపాధ్యాయ సంఘాల మధ్య పోటాపోటీ
రాజకీయ జోక్యంతోస్పందించేందుకు జంకుతున్న అధికారులు
మరొకరికి అవకాశం ఇవ్వాలి..
ఒకే ఉపాధ్యాయుడిని డీసీఈబీ కార్యదర్శిగా ఏళ్ల తరబడి కొనసాగించడం సరైంది కాదు. గతేడాది సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వారిని తొలగించాలని ఆదేశాలు ఉన్నాయి. సీనియర్లను కాదని ఇనాళ్లు ఒక్కరికే అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం మార్చాలని కోరుతున్నాం. అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టాలి.
– బౌద్ధారెడ్డి, జిల్లా అధ్యక్షుడు, టీపీఆర్టీయూ
నిబంధనలు పాటిస్తాం..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీసీఈబీ కార్య దర్శి నియామకం చేపడతాం. ఈ పోస్టుకు మూడేళ్ల కాలపరిమితి మాత్రమే ఉంటుంది. అ న్ని విషయాలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆ య న ఆదేశాల మేరకు ముందుకు సాగుతాం.
– మహ్మద్ అబ్దుల్ ఘనీ, జిల్లా విద్యాధికారి
ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదివే విద్యార్థుల నుంచి ఏడాదికి ఒకసారి రూ.110, ప్రైవేట్లోని 9, 10 విద్యార్థులకు రూ.150 పరీక్ష ఫీజులు వసూలు చేస్తారు. అలాగే ప్రైవేట్లోని 6 నుంచి 8వ తరగతి విద్యార్థుల నుంచి ఏడాదికి రూ.130 చొప్పున డీసీఈబీ వసూలు చేస్తోంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో టీసీ బుక్ కోసం రూ.300, ప్రైవేట్ పాఠశాలల నుంచి రూ.600 వసూలు చేస్తారు. ఈ నిధులతో ప్రశ్నపత్రాలు తయారు చేయించడం, విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఉపాధ్యాయులకు అవసరమైన అవగాహన కార్యక్రమాలకు వినియోగిస్తారు. ప్రస్తుతం డీసీఈబీలో రూ.37,62,536 నిధులున్నాయి. ఇవేగాక గత విద్యాసంవత్సరం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులు చెల్లించిన ఫీజులు జమ చేయాల్సి ఉంది.

విద్యాశాఖలో డీసీఈబీ రగడ!

విద్యాశాఖలో డీసీఈబీ రగడ!