
దొడ్డు వడ్లను విధిగా తీసుకోవాలి
ఎప్పటికప్పుడు ధాన్యం
తరలించాలి
గోపాల్పేట: వరి కొనుగోలు కేంద్రాల్లో కాంటా చేసిన వెంటనే ధాన్యం మిల్లులకు తరలించాలని, ఈ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని బుద్దారం, పొలికెపాడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో లారీలు అందుబాటులో లేని సమయంలో స్థానికంగా ఉండే ట్రాక్టర్లను వాడుకోవాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ తిలక్కుమార్రెడ్డి, ఆర్ఐ యాదయ్య తదితరులున్నారు.
వనపర్తి: సన్నబియ్యంతోపాటు ప్రతి మిల్లరు 5 వేల బస్తాల దొడ్డు వడ్లు విధిగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మిల్లర్లు, మిల్లు అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యాసంగి సీజన్లో సన్నవడ్లతోపాటు కొంతమంది రైతులు దొడ్డు వడ్లు సైతం పండించారని, కాబట్టి సన్న వడ్లతో పాటు ప్రతి మిల్లు 5 వేల బస్తాల దొడ్డు రకం వడ్లు సేకరించాలని, ఎవరైనా నిరాకరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే బాయిల్డ్ రైస్ మిల్లులకు 60 శాతం దొడ్డు రకం, 40 శాతం సన్న రకం వడ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. గత సీజన్ సంబంధించి సీఎంఆర్ రైస్ ఇచ్చే ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి విశ్వనాథ్, డీఎం జగన్మోహన్, మిల్లర్ అసోసియేషన్ సభ్యులు, మిల్లు యజమానులు తదితరులు పాల్గొన్నారు.