
జూన్ రెండు నాటికి భూ భారతి అమలు
వనపర్తి: రాష్ట్రవ్యాప్తంగా జూన్ 2 నాటికి భూ భారతి చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వం రూపొందించిన ధరణి చట్టంలో సమస్యలను కోర్టులో తేల్చుకోవాల్సి వచ్చేదని.. ప్రస్తుత ఇందిరమ్మ ప్రభుత్వంలో తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో అధికారులే గ్రామాలకు వెళ్లి రైతులను సమస్యలు అడిగి పరిష్కరించేలా రూపొందించామన్నారు. ఆగష్టు 15లోగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న అన్ని భూ సమస్యలు పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం పని చేస్తుందని హామీ ఇచ్చారు. అమలులో చోటుచేసుకున్న చిన్నపాటి పొరపాట్లను సరి చేసుకునేందుకు అధికారులకు పూర్తిగా స్వేచ్ఛ, వెసులుబాటు కల్పించామని మంత్రి వెల్లడించారు. రెవెన్యూ అధికారులు భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ గ్రామాలకు షెడ్యూల్ ప్రకారం వెళ్లి కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. గత ప్రభుత్వం రద్దు చేసిన వీఆర్వో, వీఆర్ఏ పోస్టులను త్వరలో పునరుద్ధరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. అంతకుముందు మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, షాట్ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి, డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ.. భూ భారతి చట్టంతో రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో పెండింగ్లో ఉన్న భూ దరఖాస్తులు పరిష్కరించేందుకు సులువైన మార్గం సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వంలో లభించిందన్నారు. భూ భారతి 2025 చట్టం రూపకల్పనలో మంత్రి పొంగులేటి పాత్ర ప్రశంసనీయమని కొనియాడారు.
అభివృద్ధి పనుల శంకుస్థాపనలు,
ప్రారంభోత్సవం..
బుధవారం రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పార్లమెంట్ సభ్యులు మల్లు రవితో కలిసి జిల్లాలో రూ.193 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో రూ.8.50 కోట్లతో నిర్మించిన పీజీ విద్యార్థుల వసతిగృహం, రూ.4 కోట్లతో నిర్మించిన ప్రిన్సిపాల్, సిబ్బంది నివాస భవనాలను ప్రారంభించారు. అలాగే ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో రూ.5 లక్షలతో నిర్మించిన నమూన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. అక్కడే రేవల్లి, శ్రీరంగాపూర్, ఏదుల తహసీల్దార్ కార్యాలయాల భవనాలకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఎంపీ నిధులు రూ.1.20 కోట్లతో నిర్మించనున్న సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహ భవనానికి శంకుస్థాపన చేశారు. కేఆర్డీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వెనుక భాగంలో రూ.69 లక్షలతో పునర్నిర్మించిన కళాశాల బాలుర వసతి గృహాన్ని ప్రారంభించారు. రూ. 55 లక్షలతో డా. బీఆర్ అంబేడ్కర్ (నల్ల చెరువు) చెరువు సుందరీకరణ పనులను ప్రారంభించారు. మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా మైనార్టీ మహిళలకు 200 కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, జి.మధుసూదన్రెడ్డి, కూచుకుళ్ల రాజేష్రెడ్డి , శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్, వ్యవసాయ మార్కెట్కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర రెవెన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి