
జూన్ 1 వరకు జత యూనిఫాంలు అందించాలి
ఖిల్లాఘనపురం: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు జూన్ 1 వరకు జత యూనిఫాంలను అందించాలని జిల్లా కోఆర్డినేటర్ యుగేందర్ అన్నారు. గురువారం స్థానిక ఎమ్మార్సీలో నిర్వహించిన హెచ్ఎంల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా 2025– 26 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థులకు అవసరమైన యూనిఫాంలకు సంబంధించిన వస్త్రాన్ని మండల సమాఖ్యకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 1 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 3,537 మంది విద్యార్థులు ఉన్నారని, విద్యాశాఖ ఆదేశాల ప్రకారం మండల సమాఖ్యకు యూనిఫాంలకు కావాల్సిన వస్త్రాలను అప్పగించామన్నారు. వెంటనే కుట్టు పనులు మొదలుపెట్టి జూన్ 1 నాటికి విద్యార్థులకు ఒక జత ఇచ్చేలా చూడాలని ఏపీఎం రాంబాబుకు సూచించారు. విద్యార్థులకు కొలతల ప్రకారం చక్కగా కుట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఎంఈఓ జయశంకర్, క్లస్టర్ హెచ్ఎం కాళిదాసు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు పాల్గొన్నారు.