
నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు
కొత్తకోట రూరల్/వనపర్తి రూరల్: ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం 14 వచ్చిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని, ఆలస్యమైతే రైతులు నష్టపోతారని కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సూచించారు. బుధవారం పెద్దమందడి, వనపర్తి మండలాల్లో 18 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా.. వనపర్తి మండలంలోని అంకూర్, వెంకటాపూర్, చిమనగుంటపల్లి, చిట్యాల కొనుగోలు కేంద్రాలను కలెక్టర్, ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కేంద్రాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తుందని, వచ్చిన ధాన్యం దొడ్డు రకమా, సన్న రకమా ఎలా గుర్తిస్తారని ప్రశ్నించారు. క్యాలీఫర్ మిషన్ ద్వారా ధాన్యం రకాన్ని గుర్తించే విధంగా శిక్షణ ఇవ్వాలని ఏపీఎంను ఆదేశించారు. కేంద్రాలకు వచ్చే రైతులకు ఇబ్బందులు కలగకుండా కనీస సౌకర్యాలు కల్పించాలని, ఎండలు తీవ్రంగా ఉన్నందున తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు సైతం తేమ శాతం, తూకం గుర్తింపు విషయంలో అవగాహన కలిగి ఉండాలన్నారు. వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి కొనుగోలు చేయాలని నిర్వాహకులను కోరారు. వారి వెంట మార్కెట్యార్డు చైర్మన్ పి.శ్రీనివాస్గౌడ్, పౌరసరఫరాలశాఖ అధికారి విశ్వనాథ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, తహసీల్దార్ రమేష్రెడ్డి, మాజీ ఎంపీపీలు కిచ్చారెడ్డి, శంకర్నాయక్, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.