
ధాన్యం కొనుగోళ్లు షురూ
జిల్లాలో 1.95 లక్షల ఎకరాల్లో వరిపంట సాగు
జిల్లాలో సాగు ఇలా..
జిల్లాలోని 14 మండలాలు, 255 గ్రామాల్లో రైతులు ఈసారి సన్న రకాలను సాగు చేస్తున్నారు. జిల్లా మొత్తంలో 1.95 లక్షల ఎకరాల్లో వరిపంట సాగు చేయగా.. 3.95 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని జిల్లా వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. జూరాల ఎడమ కాల్వ ద్వారా ఈసారి అమరచింత, ఆత్మకూర్, మదనాపురం మండలాల్లో కేవలం 20 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందగా.. మిగిలిన ఆయకట్టు రైతులు చెరువులు, బోరు బావులపై ఆధారపడి పంట పండించుకుంటున్నారు. ఆయకట్టు సాగు విస్తీర్ణం తగ్గిన రైతులు సన్నాలు సాగు చేసేందుకు ఆసక్తి చూపారు. అయితే పంట చేతికందే దశలో భూగర్భజలాలు తగ్గిపోవడంతో అక్కడక్కడ వరి ఎండిపోయి దిగుబడిపై ప్రభావం చూపింది.
మొదలైన వరికోతలు..
జిల్లాలో వరి సాగుచేసిన రైతులు ఇప్పటికే చాలా వరకు పంట కోతలు మొదలుపెట్టారు. బోరు బావులు, చెరువుల కింద వరి పండించిన రైతుల పంటలు చేతికి వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కోతలు ఎక్కడెక్కడ మొదలయ్యాయి అన్న విషయాలను తెలుసుకుని ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ పరంగా సన్న, దొడ్డురకం వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం మొదలుపెట్టారు.
అమరచింత: జిల్లాలో వరి పంట కోతలు, ధాన్యం కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. కలెక్టర్ జరిపిన సమీక్షలో ఈ నెల రెండో వారంలో వరికోతలు ప్రారంభమవుతాయని, ముందస్తుగా బోరు బావుల వద్ద వరిని పండించిన రైతుల పంట కోతకు వస్తుండటంతో ఈ నెల 1 నుంచే ప్రభుత్వ పరంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో జిల్లాలో ఇప్పటికే 90 కేంద్రాలు ప్రారంభించామని సివిల్ సప్లయ్ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా కొత్తకోటలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రం ద్వారా 400 క్వింటాళ్ల ధాన్యం కొన్నట్లు వివరించారు. గత వానాకాలం సీజన్లో వరిధాన్యం కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు చెల్లించడంతోపాటు ప్రభుత్వం ప్రకటించిన బోనస్ డబ్బులను సైతం పూర్తిస్థాయిలో రైతులకు చెల్లించారు. ఈ క్రమంలోనే మరోమారు యాసంగి కొనుగోలుకు సైతం ప్రభుత్వం సన్నాలకు బోనస్ ప్రకటించడంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వైపే దృష్టిసారిస్తున్నారు.
● ఇప్పటికే 90 చోట్ల కేంద్రాల ప్రారంభం
● సుమారు 400 క్వింటాళ్ల ధాన్యం సేకరణ
● ఊపందుకుంటున్న పంట కోతలు
● గన్నీ బ్యాగులు, టార్పాలిన్ల కొరత లేకుండా అధికారుల చర్యలు