
కనీస మద్దతు ధరలు అమలు చేయాలి
వనపర్తి రూరల్: కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా వచ్చే నెల 20న చేపట్టే గ్రామీణ భారత్ బందును జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతుల జీవితాలను, జీవనోపాధిని నాశనం చేసిన కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపే హక్కును బలవంతంగా అణచివేస్తోందన్నారు. నిరసన తెలిపే పౌరుల రాజ్యాంగ హక్కు ప్రజాస్వామ్య సమాజానికి పునాది రాయి అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాత పూర్వకంగా ఇచ్చిన హామీ ప్రకారం ఎంఎస్పీ ప్రకారం కనీస మద్దతు ధరలు నిర్ణయించి కొనుగోలుకు గ్యారంటీ చేయాలని, రైతుల రుణాలను మాఫీ చేసి, రుణ విమోచన చట్టం చేయాలన్నారు. పంటల బీమా పథకాన్ని రైతాంగానికి ఉపయోగపడే విధంగా సవరిస్తూ, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. దేశంలో ప్రతిరోజు 31 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నందున వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడం ధ్వారా వారిని అప్పుల నుంచి విముక్తి చేస్తూ రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్పొరేట్ శక్తులకు, పోలీసు అణచివేతకు వ్యతిరేకంగా దేశవ్యాప్త పిలుపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగే గ్రామీణ భారత్ బందులో రైతు సంఘాలతో పాటు ప్రజలు, ప్రజాస్వామిక వాదులు భాగస్వామ్యం కావాలని కోరారు. సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎండీ జబ్బార్, జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేశ్వరచారి, జీఎస్ గోపి, మహబూబ్బాషా, కృష్ణయ్య, భాస్కర్, రమేష్, జమ్ములయ్య తదితరులు పాల్గొన్నారు.