విజయగనరం గంటస్తంభం: కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నీరుగారుస్తూ తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ నిబంధనలను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్ డిమాండ్ చేశారు. సీఐటీయూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం విజయనగరం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. కేంద్రం నోటిఫై చేసిన లేబర్ కోడ్ రూల్స్ ప్రతాలను దహనం చేశారు. కార్పొరేట్ యాజమాన్యాలకు మేలు చేసేందుకు 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో కార్మిక వ్యతిరేక కోడ్లను తీసుకొచ్చిందని మండిపడ్డారు. పని గంటలను 12కు పెంచడం, కనీస వేతనాలు అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. కార్మిక దోపిడీ విధానాలను అడ్డుకోకపోతే దేశవ్యాప్త ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమాల్లో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు వి.లక్ష్మి, కోశాధికారి ఎ.జగన్మోహన్రావు, కార్యదర్మి బి.సూర్యనారాయణ, సీహెచ్ వెంకటేష్, బాధిత హెల్పర్లు కిల్లాడ అనసూయ, ముగడ భాగ్యలక్ష్మి, రామలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


