గరుగుబిల్లి:
తోటపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణాలపై విశ్వహిందూ పరిషత్ సభ్యులు ఆరా తీశారు. ఈ మేరకు ఆదివారం మండలంలోని తోటపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న నిర్మాణాలను, విగ్రహల ఏర్పాటును వీహెచ్పీ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఫల్గుణరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, వీహెచ్పీ ఇతర సభ్యులు అనంత్, జిల్లా అధ్యక్షుడు చింతా భాస్కరరావు, సీతానగరం మండల అధ్యక్షుడు జి.బాలకృష్ణ తదితరులు పరిశీలించారు. తోటపల్లి ఆలయంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు, ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలకు స్పందించి బీజేపీ, వీహెచ్పీ చేసిన ఆందోళనల నేపథ్యంలో వారు స్పందించి ఆలయ నిర్మాణాలను పరిశీలించారు. ఏదైతే తోటపల్లిలో స్వయం భుగా వెలసిన విగ్రహం 52 సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న స్వామి వారి విగ్రహాన్ని ఆర్అండ్బీ రోడ్ స్థలంలో రేకుల షెడ్లో బంధించి ఉన్న విధానం చూసి ఆశ్చర్యపోయారు. ఆలయంలో విగ్రహాలు, నూతనంగా చేపడుతున్న నిర్మాణాలు, ఇతర వివరాలపై సిబ్బంది, అర్చకులతో మాట్లాడి ఆరా తీశారు. పుట్టు దేవుని విగ్రహాలను బయట ఉంచడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఉచిత దర్శనం లేకపోవడంతో విస్మయం వ్యక్తం చేశారు. తోటపల్లిలో జరుగుతున్న ప్రతి అంశాన్ని పరిశీలించి నోట్ చేసుకుని తగు చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు నివేదించి, ఆగమ శాస్త్రం ప్రకారం ఎండోమెంట్ వారితో స్వామివారి విగ్రహాన్ని పునఃప్రతిష్ట చేసేలా తమ వంతు కృషిచేస్తామని పేర్కొన్నారు.
విగ్రహ పునఃప్రతిష్టకు చర్యలు


