రాజాం సిటీ: అధ్యాపకుల ఆలోచనా శక్తిని పెంపొందించేందుకు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రొగ్రాంలు ఎంతో అవసరమని గువహటి ఐఐటీ కన్వీనర్, ప్రొఫెసర్ పి.పాము అన్నారు. రాజాం జీఎంఆర్ ఐటీ డీమ్డ్ యూనివర్సిటీలో ఈ నెల 4 నుంచి నిర్వహించిన ‘ఫ్రంటియర్స్ ఇన్ ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్, ఇన్నోవేషన్స్ ఇన్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్’ అనే అంశంపై నిర్వహించిన ఫ్యాకల్టీ డెవలప్ మెంట్ ప్రొగ్రాం శుక్రవారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నానో పదార్థాలు, శక్తి నిల్వ వ్యవస్థలు, కాటలీటిక్ పదార్థాలు, హైడ్రోజన్ నిల్వ, కార్బన్ సంగ్రహణ, థిన్ఫిల్మ్, తదితర అంశాలపై జరిగిన పరిశోధనలు సమాజానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. ఇటువంటి కార్యక్రమాలు జ్ఞానం, ఆలోచనలు, వినూత్న పరిశోధనా దృక్కోణాల పరస్పర మార్పిడికి ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల సైన్స్ అండ్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ డీన్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్, ఎం.వి.సుబ్బారావు, ఆర్.ఎల్.నాయుడు, కె.కోటేశ్వరరావు, బి.విశ్వనాథం, తదితరులు పాల్గొన్నారు.


