లక్కవరపుకోట: మండలంలోని గనివాడ గ్రామంలో ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ జె.రామకృష్ణ శుక్రవారం తెలిపారు. గ్రామంలో గురువారం రాత్రి ఒక ఇంటిలో విశాఖపట్నంకు చెందిన ముగ్గురు వ్యక్తులతో కలిసి రంగాపురం, లక్కవరపుకోట, గనివాడ గ్రామాలకు చెందిన ఒకొక్కరు టీవీలో క్రికెట్ ప్రచారం జరుగుతుండగా బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రామకృష్ణ తన సిబ్బందితో ఆ ఇంటిపై దాడి చేశారు. దీంతో విశాఖపట్నంకు చెందిన ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. రంగాపురం, గనివాడ, లక్కవరపుకోట గ్రామాలకు చెందిన ముగ్గురు వ్యక్తుల పట్టుబడగా వారి నుంచి రూ. 47వేలు నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పరారైన వారి కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
పోక్సో కేసు నమోదు
విజయనగరం క్రైమ్:
స్థానిక మహిళ పోలీస్స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. దీనికి సంబంధించి దర్యాప్తు అధికారి శిరీష శుక్రవారం తెలిపిన వివరాలు.. గత నెల ఏప్రిల్ 22న చిన్నపల్లి వీధిలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో పనికి వచ్చిన గుర్లకు చెందిన అబద్దం అక్కడ మహిళా వాచ్మన్ కుమార్తె(8)ని మాయమాటలు చెప్పి అత్యాచారం చేయబో యాడు. బాలిక కేకలు వేయడంతో మిగిలిన కూలీలు వచ్చి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి దేహశుద్ది చేశారు. బాలిక తల్లి టు టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా మహిళ పోలీస్స్టేషన్కు రిఫర్ చేశారు. సీఐ నరసింహమూర్తి ఆదేశాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ శిరీష తెలిపారు.
వృద్ధురాలి అదృశ్యం
గజపతినగరం: మండలంలోని జిన్నాం గ్రామానికి చెందిన యజ్జిరోతు పోలమ్మ (75) ఈ నెల 6వ తేదీ నుంచి కనిపించడం లేదని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ కె.కిరణ్కుమార్ నాయుడు శుక్రవారం తెలిపారు. పోలమ్మ తన భర్త లక్ష్మునాయుడుతో కలిసి గజపతినగరం ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి వచ్చి స్వగ్రామం జిన్నాం వెళ్లేందుకు స్థానిక భైరిపురం జంక్షన్ వద్దకు వచ్చింది. తరువాత గజపతినగరం నుంచి మధుపాడ, మరుపల్లి గ్రామాల వైపు వెళ్లినట్టు సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్టు తెలిపారు. దీన్ని భర్త గమనించలేదు. పోలమ్మ కుమారుడు ఇజ్జిరోతు సూరినాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. ఎవరికై నా ఆచూకీ తెలిస్తే గజపతినగరం పోలీస్స్టేషన్కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు.


