నెల్లిమర్ల: పట్టణంలోని గంజాయి ముఠా గుట్టు రట్టు చేసినట్లు ఎస్సై బి. గణేష్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ డైట్ కాలనీకి చెందిన మనోహర్ అనే వ్యక్తి రాయగడ రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గంజాయిని కొనుగోలు చేసి నెల్లిమర్లలోని యువకులకు అమ్ముతున్నాడన్నారు. గంజాయి సమాచారం రావడంతో చంపావతి నదీతీరంలో గ్యాస్ గొడౌన్ వెనక భాగంలో గల తుప్పల్లో సిబ్బందితో కలిసి దాడి చేసి నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. డైట్ కాలనీకి చెందిన మనోహర్ అనే వ్యక్తి దగ్గర నెల్లిమర్ల పట్టణానికి చెందిన ప్రవీణ్, సత్య దివాకర్, నవీన్, లోకేష్ అనే నలుగురు వ్యక్తులు 100 గ్రాములు గంజాయి కొనుగోలు చేసి కాల్చడానికి వెళ్తుండగా ఈ దాడిలో పోలీసులకు పట్టుబడ్డారని, గంజాయిని అమ్మడానికి వచ్చిన మనోహర్ దగ్గర 1.2 కిలోలు గంజాయిని సీజ్ చేశామన్నారు. నెల్లిమర్ల పట్టణం, పరిసర ప్రాంతాల్లో గంజాయిపై గట్టిగా నిఘా ఏర్పాటు చేశామని ఎవరైనా గంజాయి పీల్చినా, అమ్మినా, కొనుగోలు చేసినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గంజాయి గురించి సమాచారాన్ని ఫోన్ 9121109444 నంబర్కు సమాచారం ఇవ్వాలని ఎస్సై గణేష్ కోరారు.


