● జేసీ సేతుమాధవన్
విజయనగరం ఫోర్ట్: రాయితీపై అందించే వ్యవసాయ పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జేసీ సేతుమాధవన్ అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో గురువారం వ్యవసాయ యాంత్రీకరణ మోనిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాకు మొత్తం 1160 వ్యవసాయ యంత్రాలు, పరికరాల పంపిణీకోసం రూ.422.43 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. అర్హులైన రైతులు ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, ప్లాంట్ ప్రొటెక్షన్ పరికరాలు, స్వయం చోదిత యంత్రాలు, కోత, త్రైషింగ్ యంత్రాలకు ఈ నెల 19లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. చిన్న, సన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం రాయితీపై యంత్ర పరికరాలు అందిస్తామన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వి.టి. రామారావు, ఉద్యానశాఖ ఉప సంచాలకులు చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు.


