తెర్లాం: చెరువులో పనిచేస్తుండగా పిడుగుపాటుకు గురై ఉపాధి హామీ పథకం వేతనదారు మృతి చెందగా, మరో వేతనదారు అస్వస్థతకు గురయ్యాడు. తెర్లాం పంచాయతీ మధుర గ్రామమైన చిన్నయ్యపేటలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చిన్నయ్యపేట గ్రామానికి చెందిన జమ్మల సూర్యనారాయణ(71) ఉదయం ఉపాధి పనికి వెళ్లి ఇంటికి వచ్చి భోజనం చేసిన తరువాత రెండో పూట ఉపాధి పనికి వెళ్లాడు. పని చేస్తుండగా భారీ వర్షం కురవడంతోపాటు, పిడుగు పడడంతో చెరువులోనే సూర్యనారాయణ మృతిచెందాడు. ఆయనకు దగ్గరలో ఉన్న గణపతి అస్వస్థతకు గురికావడంతో వేతనదారులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య సత్యవతి, వివాహితుడైన కుమారుడు ఉన్నారు. ఉపాధి వేతనదారు పిడుగుపడి మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎంపీడీఓ కార్యాలయం ఏఓ వెంకటరమణ, ఉపాధి ఏపీఓ సుశీల, మండల టీడీపీ అధ్యక్షుడు, తెర్లాం పీఏసీఎస్ అధ్యక్షుడు నర్సుపల్లి వెంకటేశ్వరరావు, మాజీ ఉప సర్పంచ్ మర్రాపు శంకరరావు గ్రామానికి వెళ్లి సూర్యనారాయణ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
● పిడుగుపడి ఆవు మృతి
మండలంలోని లింగాపురం పంచాయతీ పరిధి అంట్లవార గ్రామంలో పిడుగుపడి ఓ ఆవు మృతి చెందింది. గ్రామానికి చెందిన సోపేటి పకీరు ఆవు పొలంలో మేత మేస్తుండగా పిడుగుపడి మృతి చెందినట్లు బాధిత రైతు తెలిపాడు.


