● డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. జీవనరాణి
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో లింగ నిర్ధారణ వంటి చట్ట విరుద్ధచర్యలకు పాల్పడే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి హెచ్చరించారు. ఈ మేరకు స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పీసీపీఎన్డీటీ చట్టం 1994 అమలుపై మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గర్భస్థ పిండ ఆరోగ్య పరిస్థితులు, వ్యాధుల గుర్తింపు వంటి వైద్య అవసరాలకే స్కానింగ్ యంత్రాలను వినియోగించాలి తప్ప లింగ నిర్ధారణ కోసం వినియోగించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. అన్ని ఫెర్టిలిటీ కేంద్రాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. సంబంధిత పోగ్రాం అధికారులు నిరంతరం స్కానింగ్ సెంటర్స్ను పర్యవేక్షిస్తూ చట్టాల అమలులో లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. సమావేశంలో డీఎల్ఓ డాక్టర్ కె.రాణి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఎన్. సూర్యనారాయణ, డాక్టర్ మహేంద్రగిరి, డాక్టర్ జె.సుధ, డాక్టర్ నారాయణరావు, డాక్టర్ గౌతమి , డాక్టర్ స్వాతి, ఎస్.ఓ గిరిగణేష్, డాక్టర్ అర్చనాదేవి, జిల్లా పంచాయతీ అధికారి వి. మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.


