పార్వతీపురం: మండలంలోని అడారు పాఠశాలలో టేకు చెట్ల దొంగతనానికి పాల్పడిన వారికి శిక్ష విధించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు డీఎఫ్ఓ జీఏపీ ప్రసూనకు ఆమె కార్యాలయంలో మంగళవారం వినతిపత్రాన్ని అందజేశారు. దొంగలను వెంటనే అరెస్టు చేసి, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెట్ల రవాణాకు ఉపయోగించిన వాహనాలు, నిడగల్లులో ఉన్న సామిల్లును సీజ్ చేయాలని కోరారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిని సస్పెండ్ చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ మాట్లాడుతూ దొంగతనానికి గురైన చెట్ల విలువను నిర్ధారణ చేశామని, పోలీసు, రెవెన్యూ శాఖల సహకారంతో దర్యాప్తు సాగుతుందని, దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


