● జిల్లా కార్మికశాఖ ఉప కమిషనర్ ఎస్డీవీ.ప్రసాదరావు
విజయనగరం గంటస్తంభం: జిల్లాలోని దుకాణాలు,వాణిజ్య సంస్థలు, ఇతర ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులంతా స్వీయగణన నమోదు చేసుకోవాలని కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎస్డీవీ.ప్రసాదరావు బుధవారం ఒక ప్రకటనలో తెలపారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ పథకాల సక్రమ అమలుకు ఈ నమోదు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రతి కార్మికుడు తన వ్యక్తిగత వివరాలు, ఉద్యోగానికి సంబంధించిన సమాచారం సరైన విధంగా నమోదు చేసుకోవాలని సూచించారు. స్వీయగణన ద్వారా కార్మికుల పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందుబాటులోకి వచ్చి, భవిష్యత్తులో సంక్షేమ పథకాల అమలు మరింత సులభతరం అవుతుందని తెలిపారు. జిల్లాలోని కార్మిక సంఘాల నాయకులు, యాజమాన్యాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించాలని కోరారు. ముఖ్యంగా తమ సంఘాలకు చెందిన కార్మికులు తప్పనిసరిగా స్వీయగణనలో నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. కార్మికుల భద్రత, హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


