
ఫ్రాన్సిస్కోలో సెంచూరియన్ విశ్వవిద్యాలయం ప్రదర్శన
భువనేశ్వర్: సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ–మేనేజ్మెంట్ (సీయూటీఎం) అరుదైన ఘనత సాధించింది. శాన్ఫ్రాన్సిస్కోలో ప్రారంభమైన 62వ డిజైన్ ఆటోమేషన్ కాన్ఫరెన్స్ (డీఏసీ)లో పాల్గొనే అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా తన సామర్థ్యాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది. ఈ కాన్ఫరెన్స్ ఈ నెల 22న ప్రారంభమైంది, 25 వరకు కొనసాగనుంది. సెమీకండక్టర్, డిజైన్ ఆటోమేషన్ పరిశ్రమ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కాన్ఫరెన్స్లో సెంచూరియన్ ప్రాతినిధ్యం వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘చిప్స్ టు సిస్టమ్స్’ అనే శీర్షికతో నిర్వహిస్తున్న డీఏసీ కార్యక్రమానికి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ (ఈడీఏ), సెమీకండక్టర్ టెక్నాలజీలు, సిస్టమ్ ఇన్నోవేషన్ రంగంలో దిగ్గజాలు హాజరు కావడం విశేషం. వర్సిటీ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ డీఎన్ రావు ఆధ్వర్యంలో ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ దాస్, లక్ష్మీకాంత్ సుతార్లతో కూడిన బృందం సెంచూరియన్ తరఫున ప్రాతినిధ్యం వహించింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డీఎన్ రావు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి వేదికపై సామర్థ్యాన్ని ప్రదర్శించిన తొలి వర్సిటీగా సెంచూరియన్ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. వర్సిటీలో సెమీకండక్టర్ టెక్నాలజీ పాఠ్యాంశాలు మెరుగుపరచడానికి మార్క్యూ సెమీ కండక్టర్స్తో ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. విద్యతో పాటు సాంకేతిక ఆవిష్కరణల్లోనూ వర్సిటీ గుర్తింపు సాధించడం ఆనందంగా ఉందన్నారు. అధునాతన పారిశ్రామిక రంగానికి అక్కరకు వచ్చే రీతిలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. రానున్న కాలంలో ప్రపంచ స్థాయిలో సెంచూరియన్ తన ఉనికి చాటుకుంటుందని ఆశాభవం వ్యక్తం చేశారు.