
కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్నే కాదు.. మూగజీవుల సంక్
సంచార పశు ఆరోగ్య సేవ వాహనం
● జిల్లాలో నిలిచిన సంచార
పశుఆరోగ్య సేవలు
● మొదటి విడతలో నిలిచిన కొన్ని
వాహన సేవలు
● తాజాగా మిగిలిన వాహన సేవలు
నిలిపివేస్తూ ఉత్తర్వులు
● వాహనాల్లో పనిచేసే సిబ్బందిని
తొలగించిన జీవీకే సంస్థ
● వాహనాలను పశుసంవర్ధక శాఖ
ఏడీ కార్యాలయాలకు
అప్పగించాలని ఆదేశం
విజయనగరం ఫోర్ట్:
ఇది పాడి రైతులకు ఆవేదన, ఆందోళన కలిగించే వార్త. ఇన్నాళ్లూ.. అత్యవసర వేళ పశుశాలల వద్దకు వచ్చి వైద్యసేవలందించే వాహన సేవలు నిలిచిపోయాయి. మూగ జీవాలకు సంచార వైద్య సేవలు ఇక అందవు. కూటమి సర్కారు సంచార పశుఆరోగ్య సేవ వాహనాలను బుధవారం నుంచి పూర్తిగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల కిందట ఆరంభించిన సేవల నిలిపివేత ప్రక్రియను ముగించింది. మూగ జీవాల వైద్యం కోసం ఎప్పటి మాదిరి పశువైద్యశాలలకు తీసుకెళ్లాల్సిందే. రైతులు వ్యయప్రయాసలు భరించాల్సిందే. మొదటి విడత సిబ్బందికి టెర్మినేషన్ ఆర్డర్స్ ఇవ్వడంతో వారంతా గత రెండు నెలలుగా రోడ్డున పడ్డారు. తాజాగా రెండో విడత వాహనాల్లో పనిచేసే సిబ్బందికి తొలగింపు ఉత్తర్వులు జారీ చేయడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అధికారంలోకి వస్తే లక్షాలాది ఉద్యోగాలు ఇస్తామని గొప్పలు చెప్పిన కూటమి సర్కారు ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వాహనాలు అప్పగించాలని ఆదేశం
జిల్లాకు మొదటి విడతలో మంజూరైన విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి, రాజాం, ఎస్.కోట, నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాల్లోని ఏడు సంచార పశు ఆరోగ్యసేవ వాహన సేవలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిపివేసింది. తాజాగా గజపతినగరం, బొబ్బిలి, ఎస్.కోట, రాజాం, నెల్లిమర్ల, చీపురుపల్లిలో ఉన్న మరో ఆరు వాహన సేవలను నిలిపివేసింది. ఈ వాహనాలను పశు సంవర్థక శాఖ సహాయ సంచాలకుల కార్యాలయాలకు అప్పగించాలని ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సంచార పశు ఆరోగ్య సేవను జీవీకే ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీస్ నిర్వహించేది. ఆ సంస్థ టెండర్ కాలపరిమితి ముగియడం, కొనసాగింపు ఉత్తర్వులను ప్రభుత్వం జారీచేయకపోవడంతో బాధ్యతల నుంచి సంస్థ వైదొలగింది.
ఆదేశాలు వచ్చాయి
సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను పశు సంవర్థక శాఖ సహాయ సంచాలకులకు అప్పగించాలని ఆదేశాలు వచ్చాయి. సిబ్బందిని తొలగిస్తూ సంస్థ నుంచి వచ్చిన ఆదేశాలు అందజేశాం. సంచార వైద్యసేవలు ఇక ఉండవు.
– బి.నారాయణరావు, జీవీకే ఈఎంఆర్ఐ సంస్థ జిల్లా మేనేజర్
పశువైద్యం ఇక దూరం
గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పాడి రైతులకు అండగా రాష్ట్రవ్యాప్తంగా 2022 సంవత్సరంలో సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. జిల్లాకు 13 వాహనాలను కేటాయించింది. ఒక్కో వాహనంలో ఒక డ్రైవర్, పారావిట్, పశు వైద్యుడు పనిచేసేవారు. ఆరు వాహనాలకు ఒక రిలీవర్ ఉండేవారు. మూగ జీవాలు అనారోగ్యానికి గురైతే వైద్యులు వాటి చెంతకు వెళ్లి సేవలు అందించేవారు. దీనివల్ల రైతులకు ఎలాంటి వ్యయప్రయాసలు ఉండేవికావు. పాడి రైతుకు పశువైద్య భరోసా కలిగేది. వాహనాలు రాకముందు పశువులకు జబ్బు చేస్తే పశు వైద్యశాలలకు తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ పాత రోజులే వచ్చే పరిస్థితి వచ్చిందని పాడిరైతులు వాపోతున్నారు.

కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్నే కాదు.. మూగజీవుల సంక్

కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్నే కాదు.. మూగజీవుల సంక్