
పాముకాటుతో దివ్యాంగుడి మృతి
నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొత్తపేట గ్రామంలో పాముకాటుతో ఓ దివ్యాంగుడు మృతిచెందాడు. ఈ ఘటనపై కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అట్టాడ పూడిపినాయుడు(39) దివ్యాంగుడు. గురువారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో డాబాపై నిద్రించేందుకు వెళ్తున్న క్రమంలో మెట్ల వద్ద మాటువేసి ఉన్న పాము ఒక్కసారిగా కాటువేసింది. చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు విజయనగరం ప్రభుత్వాస్పత్రికి వెంటనే తరలించినప్పటికీ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పూడిపినాయుడు దివ్యాంగ పింఛన్పై ఆధారపడి జీవిస్తున్నాడు. మృతుడికి భార్యతో పాటు పాప, బాబు ఉన్నారు. ఇంటి యజమాని చనిపోవడంతో కుటుంబసభ్యులు తీవ్రంగా రోదించారు. మృతదేహానికి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్మార్టం పూర్తి చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.