
మలేరియా రహిత జిల్లాగా మార్చుదాం
విజయనగరం ఫోర్ట్: వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతో మలేరియా రహిత జిల్లాగా మార్చుదామని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా చేపట్టిన అవగాహన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిల్వ ఉన్న మంచి నీటిలో మలేరియాను వ్యాప్తి చేసే ఆడ ఎనాఫిలిస్ దోమలు పెరుగుతాయన్నారు. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు దోమల నివారణకు సహకరించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ అధికారులు వసతి గృహాల విద్యార్థులు దోమకాటుకు గురికాకుండా ముందుగానే వసతి గృహాల కిటికీలు, గుమ్మాలకు దోమల జాలీలు అమర్చాలన్నారు. విద్యార్థులకు దోమల నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో 157 గ్రామాలను మలేరియా అధిక ప్రభావిత గ్రామాలుగా గుర్తించి రెండు విడతల్లో దోమల నివారణ మందు పిచికారీ చేయాలని ఆదేశించామన్నారు. మే 15వ తేదీ నుంచి మొదటి విడత పిచికారీ మొదలవుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అచ్యుతకుమారి, ఎన్సీడీ పీఓ డాక్టర్ సుబ్రహ్మణ్యం, సహాయక మలేరియా నివారణ అధికారి రమణ, తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి