
ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు శిక్షణ
కొత్తవలస: వియ్యంపేట గ్రామ సమీపంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులు (బాలికల) పాఠశాలలో ఇంటర్మీడియట్ ఫస్టియర్లో ఫెయిలైన విద్యార్థులకు శిక్షణ తరగతులను డీసీఓ ఎస్.రూపవతి సోమవారం ప్రారంభించారు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఉమ్మడి విజయనగరం జిల్లాలో 13 ఆశ్రమ పాఠశాలల్లో 51 మంది బాలికలు ఇంటర్ మొదటి సంవత్సరం వివిధ సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారని, వీరందరినీ వియ్యంపేట ఆశ్రమ పాఠశాలకు చేర్చి సప్లిమెంటరీ పరీక్షకు సన్నద్ధం చేస్తున్నామన్నారు. శిక్షణ తరగతులు వచ్చేనెల 10వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. శిక్షణ ఇచ్చేందుకు 37 మంది అధ్యాపకులను నియమించినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ టి.జయశ్రీ, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అభ్యంతరాల స్వీకరణ గడువు పెంపు
విజయనగరం ఫోర్ట్: రాష్ట్రీయ బాలస్వస్థలో పోస్టులకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 30వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఫలించిన పీఓ కృషి
సీతంపేట: ఐటీడీఏ పీఓ యశ్వంత్కుమార్ రెడ్డి చొరవ ఫలించింది. స్థానిక గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న చిలకల అవనికి మెరుగైన వైద్యసేవలు అందాయి. ఊపిరితిత్తులు, కాలేయ ఇన్ఫెక్షన్ సమస్యకు 50 రోజుల పాటు కేజీహెచ్లో చికిత్స పొంది ప్రాణాపాయ స్థితి నుంచి బాలిక బయటపడింది. రేగిడి మండలం గదబపేట నుంచి పాఠశాలకు సోమవారం చేరుకుంది. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యసేవలు అందేలా కృషిచేసిన పీఓకు బాలిక తల్లిదండ్రులు ఆయన కార్యాలయానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ డీడీ అన్నదొర, వైద్యాధికారి విజయపార్వతి పాల్గొన్నారు.

ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు శిక్షణ