ప్రాథమిక పాఠశాలకు టాటా..? | - | Sakshi
Sakshi News home page

ప్రాథమిక పాఠశాలకు టాటా..?

Apr 20 2025 2:35 AM | Updated on Apr 20 2025 2:35 AM

ప్రాథమిక పాఠశాలకు టాటా..?

ప్రాథమిక పాఠశాలకు టాటా..?

పాఠశాల ఎత్తివేసే పరిస్థితి

మా గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎత్తేసే పరిస్థితి కనిపిస్తోంది. ఉన్నత పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశాలు చేస్తున్నారు. దీంతో ప్రాథమిక పాఠశాలల్లో చేరే విద్యార్థులు ఉన్నత పాఠశాలల వైపు వెళ్లిపోయే పరిస్థితి ఉంది. దీంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఇక్కడ ఎత్తేసే పరిస్థితి కనిపిస్తోంది. కనీసం విద్యార్థులు తల్లిదండ్రులతో సమావేశం, గ్రామ ప్రజా ప్రతినిధులతో ఆలోచన చేయలేదు. గురుగుబెల్లి స్వామినాయుడు,

కళింగ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌, వాల్తేరు

మంచి విధానమే

అన్ని ఉన్నత పాఠశాలల్లో ప్రాథమిక విద్యకు అడ్మిషన్లు ఇవ్వడంలేదు. గతంలో 3 నుంచి 5 వ తరగతివరకూ విలీనమైన ఉన్నత పాఠశాలల్లోనే ప్రాథమిక విద్యకు అవకాశం కల్పించాం. ఈ విధానంతో ఆయా ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ ప్రాథమిక పాఠశాల అక్కడ కొనసాగాలంటే కనీసం 45 మంది విద్యార్థులు దాటి ఉండాలి.

యు.మాణిక్యంనాయుడు,

డీఈఓ, విజయనగరం.

ఉన్నత పాఠశాలల్లో ఒకటోతరగతి

నుంచే అడ్మిషన్లు

● ఎక్కడైనా చేరవచ్చంటూ అంటూ జీఓ జారీ

జిల్లావ్యాప్తంగా 287 ప్రాథమిక

పాఠశాలల ఎత్తివేతకు కసరత్తు

రాజాం: ప్రభుత్వ విద్య బలోపేతం మాట పక్కన పెడితే ఉన్న విద్య అటకెక్కేలా కనిపిస్తోంది. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా గడిచిన రెండేళ్ల క్రితం నుంచే కేంద్ర మానవవనరులశాఖ ప్రభుత్వ ప్రాథమిక విద్యను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేందుకు ఆర్‌టీఈని ప్రయోగించింది. అప్పటి రాష్ట్రప్రభుత్వం ఈ విద్యావిధానాన్ని అడ్డుకోవడంతో పాటు ప్రాభుత్వ ప్రాఽథమిక విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల వద్ద ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటుకు కృషిచేసింది. మరోవైపు ఎన్‌ఈపీని గౌరవిస్తూ 3 నుంచి 5 వతరగతి వరకూ కొన్నిగ్రామాల్లోని (ఉన్నత పాఠశాల నుంచి 500 మీటర్లు లోపు ఉన్న పాఠశాలలకు చెందిన) తరగతులను గ్రామపెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రుల అంగీకారంతో విలీనం చేసేందుకు అవకాశం కల్పించింది. అయితే ఈ విధానాన్ని చాలా గ్రామాల్లో వ్యతిరేకించడంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు చాలాచోట్ల యథావిధిగా కొనసాగాయి. ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారైంది. రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కేంద్రానికి వత్తాసు పలుకుతూ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేందుకు సిద్ధమైంది. ఈమేరకు అన్ని మండల మానవ వనరుల కేంద్రాలకు, జిల్లా పరిషత్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు తమ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచే చేరికలు చేసుకోవచ్చునని ఆదేశాలు జారీచేసింది.

287 పాఠశాలల వరకూ విలీనం

కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదికే చాలామంది ఉద్యోగులు, ప్రధానంగా ఉపాధ్యాయుల్లో ఈ విధానం ఆందోళన కలిగించింది. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి బాహాటంగానే మద్దతు ఇవ్వడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించలేక, కొనసాగించలేక సతమతమవుతున్నారు. ఇప్పటికే ఈ సర్క్యులర్లు అందుకున్న పాఠశాలలు తమ పాఠశాలల్లో ప్రాథమిక తరగతుల ప్రారంభానికి కసరత్తు చేసుకుంటున్నారు. ఆయా పాఠశాలల్లో ఇదివరకే ప్రాథమిక విద్యను బోధించే ఉపాధ్యాయులు ఉండడంతో విద్యార్థుల సంఖ్యను పెంచుకునే ప్రయత్నం గుట్టుగా చేస్తున్నారు. ఈ కొత్త జీఓ బయటకు వస్తే చాలామంది నిరుద్యోగుల్లో వ్యతిరేకత అధికమవుతుందనే ఉద్దేశంతో విద్యాశాఖ గుప్‌చుప్‌గా తంతు నడిపిస్తోంది. ఈ విషయం తెలిసి నిలదీస్తున్న పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయా గ్రామాల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కూడా ఒకటో తరగతి అడ్మిషన్లు ఇస్తున్నామని, విద్యార్థులకు ఎక్కడ నచ్చితే అక్కడ చేర్పించుకోవచ్చునని నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1317 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 168 ప్రాథమికోన్నత పాఠశాలలు, 232 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఉన్నత పాఠశాలల పరిధిలో ఒక్కో గ్రామంలో గతంలో విద్యార్థులు, జనాభా సంఖ్య ఆధారంగా ఒకటి నుంచి మూడేసి ప్రాథమిక పాఠశాలలు ఉండేవి. ఇప్పుడు ఇందులోని 287కిపైగా ప్రాథమిక పాఠశాలలు దగ్గర్లోని ఉన్నత పాఠశాలల్లో విలీనం కానున్నాయి.

ఎత్తివేతకు సిద్ధంగా రాజాం పట్టణంలోని డోలపట ప్రాథమిక పాఠశాల

వింత కొర్రీలు

మరోవైపు ప్రాథ మిక పాఠశాలల్లో వంటలు వండుతున్న మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఖ్య కుదింపు ప్రారంభమైంది. పూర్తిగా మధ్యాహ్న భోజనం పథకం నిర్వాహకుల విధానం ప్రాథమిక పాఠశాలల్లో అటకెక్కే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఉన్నత పాఠశాలల్లో చేరిన 3 నుంచి 5వ తరగతి విద్యార్థులు మళ్లీ వెనక్కు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం కొత్త కొర్రీ పెడుతోంది. ఇప్పటికే ఉన్నత పాఠశాలల్లో చేరిన విద్యార్థులు మళ్లీ వెనక్కు వెళ్లాలంటే కుదరదని కచ్చితంగా చెబుతుంది. అలా తప్పని పరిస్థితుల్లో వెళ్లాలంటే దగ్గరలో 45 మంది విద్యార్థులు దాటి ఉన్న ప్రాథమిక పాఠశాలకు, మోడల్‌ స్కూల్‌కు వెళ్లాలని చెబుతున్నారు. ఫలితంగా విద్యార్థులు ఉన్నత పాఠశాలల్లో మానేసి, ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement